సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ గొడవ మొదలైంది. ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సీఐ శివకుమార్ అడ్డుకోవడమే కాకుండా.. ఆయన కాలర్ పట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.
ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తన అభ్యర్థి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరుకుంది. పోలీసులకు, జగ్గారెడ్డికి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం నడిచింది. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. జగ్గారెడ్డి ససేమిరా అనడమే కాకుండా పోలీసులపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
పోలీసుల తీరుపై మండిపడుతూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘రిగ్గింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మా అభ్యర్థి గల్లా పట్టుకుంటాడా? ఆ సీఐ మొగోడు అయితే ఇక్కడికి రావాలి. ఈరోజు నేనో, పోలీసులో తేలిపోవాలి’ అంటూ సవాల్ విసిరారు. సంగారెడ్డిలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే దానికి సీఐ శివకుమార్, అక్కడ ఉన్న హోంగార్డులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు గల్లాను సీఐ పట్టుకున్నారన్న సమాచారంతో
పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డిపోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి
పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
ఘటన… pic.twitter.com/GBwpmusRVW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2026
‘ఏమనుకుంటున్నారురా మీరు హోంగార్డులు? బాధ్యత గల సీఐ అయి ఉండి అభ్యర్థి కాలర్ పట్టుకుంటావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదా?’ అంటూ జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. 26 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ పోలింగ్ బూత్లోకి వెళ్లలేదని, కానీ పోలీసులు తనను రెచ్చగొట్టడం వల్లే లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
వీడియోలు వైరల్..
సీఐ సంగతి తేల్చేస్తానని.. తాను ఇక ఊరుకునే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా మోహరించిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ALSO READ: Medchal Collector: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!