సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే క్రమంలో భారత రాష్ట్ర సమితి (BRS) తన దూకుడును ప్రదర్శిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలపడంతో అక్కడ గులాబీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా చేరుకుంది.
ఇంద్రేశం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. దీంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం లాంఛనమైంది. జిల్లాలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్కు, ఇంద్రేశం విజయంతో హ్యాట్రిక్ దక్కినట్లయింది. అయితే, జిన్నారం, ఇస్నాపూర్, కోహిర్, జహీరాబాద్ మున్సిపాలిటీల ఫలితాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
మరోవైపు, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ మొత్తం 26 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా ఉన్నాయి. బీఆర్ఎస్ 12 స్థానాల్లో, కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 13కు చేరింది. అదే క్రమంలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ బలం కూడా 13కు చేరుకుంది.
బలాబలాలు సమానంగా ఉన్న తరుణంలో ఎక్స్ అఫీషియో ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇస్నాపూర్లో తమ ఎక్స్ అఫీషియో ఓట్లను నమోదు చేసుకున్నారు. ఈ ఓట్ల ద్వారా ఇస్నాపూర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకత్వంతో టచ్లోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటు రెండు పార్టీల భవితవ్యాన్ని తేల్చనుంది. గెలుపు గుర్రాలు ఎటువైపు మళ్ళుతాయో అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అటు బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, ఇటు కాంగ్రెస్ ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏదేమైనా సంగారెడ్డి జిల్లా మున్సిపల్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది.