Formula E Race: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించడంతో .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన తదుపరి చర్యలను ముమ్మరం చేసింది.
ఈ కేసులో ఏసీబీ నలుగురిని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి KTR, A2గా మున్పిపల్ శాఖ మజీకార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, A4గా ఎఫ్ఈఓ FEO కంపెనీపై IPC సెక్షన్ 409 – 120B, అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(1)(A), 13(2) కింద కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే కనిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష నుండి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు మళ్లించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. క్యాబినెట్ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండానే ఈ నిధులను చెల్లించారని.. ఇది తీవ్రమైన అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగమని ఏసీబీ ఆరోపిస్తోంది.
చట్టప్రకారం ప్రజాప్రతినిధులను లేదా ఐఏఎస్ అధికారులను విచారించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే.. కేటీఆర్ (A1)ను ప్రాసిక్యూట్ చేయడానికి గత ఏడాది నవంబర్ 20న గవర్నర్ అనుమతినిచ్చారు. అరవింద్ కుమార్ (A2)ను ఐఏఎస్ అధికారి కావడంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజకీయ నేతలతో పాటు కీలక అధికారులపై కూడా విచారణకు లైన్ క్లియర్ కావడంతో.. ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.
Also Read: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు