సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని రెసోనెన్స్ గురుకుల్ క్యాంపస్లో విద్యార్థుల మధ్య మత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తల్లిదండ్రుల మధ్య దాడికి దారితీసింది. హాస్టల్ గదిలో గోడపై మతపరమైన రాతలు రాయడం, వాటిని చెరిపివేయడం కారణంగా డిసెంబర్ 2న రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగింది.
ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, కొందరు తల్లిదండ్రులు క్యాంపస్కు వచ్చి ప్రిన్సిపాల్ గదిలో, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరిని చెప్పుతో కొట్టగా, మరొకరిని గల్లా పట్టి కొట్టారు. లక్షల ఫీజులు చెల్లించి తమ పిల్లలను చేరిస్తే, ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టడంపై మిగతా విద్యార్థుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రతపై లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ గొడవ చివరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్కు చేరింది.