సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో ఇబ్బంది పడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
ఆసుపత్రికి తరలింపు..
విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మరికొందరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
విచారణకు ఆదేశం..
మధ్యాహ్న భోజన నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట గదిలో అపరిశుభ్రత లేదా కాలం చెల్లిన పదార్థాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యాలపై పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.