తెలంగాణ జాతి పిత, కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే అది కేవలం ఒక వ్యక్తిని టచ్ చేయడం కాదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని సవాల్ చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
దశాబ్దాల పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేతపై బురద చల్లాలని చూడటం.. సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదేనని హరీశ్ రావు విమర్శించారు. అటువంటి చరిత్రాత్మక నాయకుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ చరిత్ర సృష్టించిన నాయకుడని, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పరిపాలనా చేతకానితనం వల్ల ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇటువంటి కుతంత్రాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందవచ్చనే దురాలోచనతోనే ఇదంతా చేస్తున్నారని, ఇది రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని హరీశ్ రావు దుయ్యబట్టారు.
అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారి వెంటే ఉందని, ఇటువంటి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.
ALSO READ: Vizag-Janasena: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!