Sathyakumar hot comments: సొంతిల్లు చక్కబెట్టుకోకుండా.. పక్కవారి విషయాల్లో తల దూర్చి అడ్డంగా బుక్కైపోవడమేంటే ఇదేనేమో. అచ్చం ఈ సామెత బీఆర్ఎస్ నేత కేటీఆర్కు అతికినట్టు సరిపోతుంది. తన పార్టీ విషయాల గురించి మీడియా నుంచి తప్పించుకోబోయి.. బీజేపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారాయన.
మూడురోజుల ముందు ఢిల్లీ వెళ్లారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఆయన మీడియాకు సమాచారం ఇస్తారు. ఈసారి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. సడన్గా ప్రెస్మీట్ పెట్టారు. ఢిల్లీకి ఎందుకు వచ్చానో చెప్పకుండా, మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఏపీ వ్యవహారాలను తెరపైకి తెచ్చారాయన. తాను సెల్ఫ్గోల్ వేసుకునే క్రమంలో ఏపీ గురించి నాలుగు మాటలు మాట్లాడారు.
ఏపీలో వైసీపీ ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అంటే జగన్ పాలనను ఆయన పూర్తిగా సమర్థించినట్టే. పథకాల పేరిట ప్రజల ఖాతాలో నిధులు వేయడం మంచిదా? ప్రశ్నించే గొంతుకులను నోరు ఎత్తకుండా డిక్టేటర్ తరహా పాలనను ఆయన సమర్థిస్తున్నారా? అభివృద్ది ఎక్కడ? 40 శాతం ఓట్లు వచ్చిన జగన్ హీరో అయితే, అధికారంలోకి వచ్చిన టీడీపీ మాటేంటి? అన్నది ఏపీలోని రాజకీయ నేతల వెర్షన్.
పనిలోపనిగా ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడంపై నోరువిప్పారు కేటీఆర్. నా మిత్రుడు రోజూ ప్రజల మధ్య ఉండేవారని ఆయనా ఓడిపోయారని, అక్కడ బీజేపీ గెలవడాన్ని ఇన్డైరెక్ట్గా ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్కు సొంత బలంలేదన్నది ఆయన మాట. ఆయన గెలవడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారా?
తెలంగాణ బీఆర్ఎస్ పాలన మాదిరిగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో భూములు కూడబెట్టుకున్నా రన్నది ఏపీ మంత్రి సత్యకుమార్ వెర్షన్. కేతిరెడ్డికి తెల్లవారితే కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లు మాత్రమే గుర్తుకు వస్తాయని సెటైరికల్గా రియాక్టయ్యారు. నాలుగేళ్ల కిందట మీ అవినీతిని ప్రశ్నించినందుకు నా ట్విట్టర్ను బ్లాక్ చేసింది మీరు కాదా? అంటూ కేటీఆర్పై హాట్ కామెంట్స్ చేశారు. డిక్టేటర్ పాలననే ఇరు రాష్ట్రాల్లో ఓడించారని, మీరంతా ఒకేజాతి పక్షులని అందుకే సర్టిఫికెట్లు, ఓదార్పులని అన్నారు మంత్రి.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధమే లేదు.. ప్రభాకర్రావు సంచలన లేఖ!
మరో వెర్షన్ ఏంటంటే.. కేతిరెడ్డితో కేటీఆర్కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే వార్తలు సోషల్మీడియా లో జోరందుకున్నాయి. కేటీఆర్ అండ్ కో కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారనే ప్రచారం లేక పోలేదు. నాలుగేళ్ల కిందట మంత్రిగా కేటీఆర్ చేసిన పని మంత్రి సత్యకుమార్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి బాధితులు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంతమంది ఉన్నారో?