Rahul Dravid Request to BCCI : టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాకి బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. అందులో ఆటగాళ్లతో సమానంగా హెడ్ కోచ్ ద్రవిడ్ కి కూడా రూ.5 కోట్లు ఇచ్చింది. అయితే తనతో పాటు పనిచేసిన బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ వీళ్లకి మాత్రం రూ.2.5 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో రాహుల్ ద్రవిడ్ తనలోని గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
ఆటగాళ్లందరికీ ఒక గాటన కట్టి సమానంగా రూ.5 కోట్లు చొప్పున ఇచ్చారు. కోచింగ్ స్టాఫ్ కి కూడా ఒకే తరహాలో ఇవ్వాలి. నా ఒక్కడికి రూ. 5 కోట్లు ఇచ్చి, మిగిలిన వాళ్లకి అందులో సగం ఇవ్వడం నాకు నచ్చలేదు. మావాళ్లతో పాటు నాక్కూడా రూ.2.5 కోట్లే కావాలి అని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో బీసీసీఐ కూడా ఒప్పుకుందని అంటున్నారు. ద్రవిడ్ విజ్ణప్తిని గౌరవించినట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : టీ20 ర్యాంకింగ్ టాప్-10లో సూర్యకుమార్, రుతురాజ్, శ్రీలంక, కివీస్లకు షాక్
రాహుల్ ద్రవిడ్ మొదటి నుంచి ఇదే పంథాలో నడిచినట్టు అతని సహచరులు చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ 19 కోచ్ గా ఉన్నప్పుడు కూడా వారు ప్రపంచకప్ గెలిచారు. అప్పుడు ద్రవిడ్ కి రూ.50 లక్షలు ఇచ్చి, సహచర కోచ్ లకి రూ.20 లక్షల చొప్పున ఇచ్చారు. దీంతో ద్రావిడ్ వారితో సమానంగా ఇవ్వమని కోరడంతో బీసీసీఐ అప్పుడేం చేసిందంటే సహచర స్టాఫ్ కి రూ.25 లక్షల చొప్పున పెంచి ఇచ్చింది. ద్రవిడ్ కోరుకున్నట్టుగానే వారితో సమానంగా రూ.25 లక్షలు ఇచ్చింది.
ఇప్పుడు నెట్టింట ఆ విషయాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. అలాగే ద్రవిడ్ మంచితనాన్ని, క్రీడాకారుల్లో తారతమ్యాలు చూడకూడదని తను చెప్పే సందేశం చాలా గొప్పదని మెచ్చుకుంటున్నారు. రూ.2.5 కోట్లు వదులుకోవడం అంటే మాటలు కాదని, ఈరోజుల్లో ద్రవిడ్ లాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. సమానత్వాన్ని కోరుకునే ద్రవిడ్ లాంటివారు సమాజంలో ఉన్నప్పుడే కొందరి కళ్లయినా తెరుచుకుంటాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ద్రవిడ్ నిర్ణయం పట్ల నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.