Tamil Directors: పాన్ ఇండియా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు ఉంది.. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామలు అభిమానుల్లో పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా హీరో అల్లు అర్జున్తో కలిసి చేయబోయే AA23 సినిమా ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అభిమానుల మధ్య వాదనలు.. అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
అల్లు అర్జున్ అభిమానులు ఈ కాంబినేషన్పై ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొంతమంది కోలీవుడ్ అభిమానులు మాత్రం లోకేష్పై అసంతృప్తి చూపిస్తున్నారు. తమిళ సినిమాను పక్కన పెట్టి డబ్బు, పేరు కోసం ఇతర పరిశ్రమల వైపు వెళ్లారని ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కైతి 2..రోలెక్స్ వంటి సినిమాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అంటున్నారు.
ఈ విమర్శలు ఒక్క లోకేష్కే పరిమితం కావడం లేదు. దర్శకులు ఆట్లీ.. నెల్సన్ దిలీప్కుమార్ కూడా తమిళ పరిశ్రమను వదిలి ఇతర భాషలపై దృష్టి పెట్టారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళ ప్రేక్షకుల మద్దతుతో ఎదిగిన దర్శకులు పీక్ టైంలో ఇలా బయటకు వెళ్లడం సరైంది కాదని భావిస్తున్నారు.
ఇదే సమయంలో నెల్సన్ త్వరలో హీరో ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, జైలర్ 2 తర్వాత ఈ ప్రాజెక్ట్పై చర్చలు జరుగుతున్నాయనే టాక్ ఉంది.
ఈ దర్శకులను చాలా మంది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పోలుస్తున్నారు. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసిస్తున్నారు.
లోకేష్–అల్లు అర్జున్ కాంబినేషన్ తమిళ సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైంది. ప్రముఖ దర్శకులు ఇతర పరిశ్రమల వైపు వెళ్లడంతో, తమిళ సినిమాకు కొత్త దర్శకుల అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read: Allu Arjun: జపాన్ ప్రీమియర్లో అల్లు అర్జున్ మాస్ మోమెంట్… జపనీస్ డైలాగ్ హైలైట్