Medchal News: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ GHMC పరిధిలోని 297, 298 డివిజన్లలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం ఇటీవల మేడ్చల్లో ధర్నా నిర్వహించిన అనంతరం జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి సమస్య వివరించామని తెలిపారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారం రోజులు గడిచినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. సోమవారం మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణంలో ప్రజలు నీటి కోసం విలవిలలాడుతున్నారని అన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే కుటుంబాలు కూడా రూ.700 వరకు ట్యాంకర్లకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దయనీయంగా మారిందన్నారు. వివేకానంద విగ్రహం నుంచి రైల్వే స్టేషన్ రోడ్ వరకు గుంతలతో నిండిపోయిన రోడ్లు, మాన్హోల్స్ లేని డ్రైనేజీ కారణంగా ప్రజలు భయంతో ప్రయాణిస్తున్నారని తెలిపారు. సమస్యపై పలుమార్లు అధికారులకు మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతుండగా మేడ్చల్లో మాత్రం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు బాధ్యత వహించే మంత్రులు లేకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallreddy) నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ కోఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు విష్ణు చారి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Doctor Misconduct: జ్వరంతో వచ్చిన మహిళపై వైద్యుని అసభ్య ప్రవర్తన