Maganti Sunitha: షేక్పేట్లోని సమతా కాలనీ అపెక్స్ స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 4, 5, 6, 7, 8 వద్ద కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణానగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు. ఉద్రిక్తతలు పెరగడంతో మాగంటి కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలింగ్ చివరి గంటల్లో కృష్ణానగర్, షేక్పేట్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణానగర్లోని అమరావతి స్కూల్ 238వ నెంబర్ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తుంటే పోలీసులు కేవలం చోద్యం చూస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ ఏర్పాట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా, కోడ్ కారణంగా కాంగ్రెస్ అభ్యంతరంతో విరమించుకున్నారు. నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
మరోవైపు, షేక్పేట్లోని సమతా కాలనీ అపెక్స్ స్కూల్ బూత్ల (నెం. 4-8) వద్ద కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడారన్న సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారు బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ చివరి దశలో ఈ ఘటనలతో గందరగోళం నెలకొంది.
ఎర్రగడ్డ డివిజన్లోని డాన్ బాస్కో స్కూల్లో 10 బూతులను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పరిశీలించారు. గతంలో కన్నా ఈసారి పోలింగ్ అధికంగా నమోదవుతుందని తెలిపారు. ఎర్రగడ్డలో నవీన్ యాదవ్ పోలింగ్ బూతుల్లోకి వెళ్లడంపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
జూబ్లీహిల్స్లోని కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం రణరంగాన్ని తలపిస్తోంది. మాగంటి సునీత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తోందని ఆరోపిస్తూ బైఠాయించి ధర్నా చేశారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నేతలు వినిపించుకోవడం లేదు. దీంతో పోలీసులు మాగంటి సునీత, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.