హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శంషాబాద్ నుండి సింగపూర్ వెళ్లాల్సిన సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఈమెయిల్ రూపంలో ఈ హెచ్చరిక రావడంతో విమానాశ్రయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణం ప్రారంభించాల్సిన ఈ విమానం బాంబు స్క్వాడ్ తనిఖీల్లో చిక్కుకుంది.
బెదిరింపు సందేశం అందిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్లైన్స్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానంలో ప్రయాణించాల్సిన 155 మంది ప్రయాణికుల ప్రయాణాన్ని అధికారులు తక్షణమే నిలిపివేశారు. ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి విమానాన్ని ఐసోలేషన్ బేలోకి తీసుకువెళ్లారు. అక్కడ బాంబు డిస్పోజల్ టీమ్ అధునాతన పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. ప్రతి సీటుతో పాటు ప్రయాణికుల లగేజీని భద్రతా బలగాలు పరిశీలిస్తున్నాయి.
ఈ పరిణామంతో విమానాశ్రయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఇది ఆకతాయిల పనా..? లేక ఏదైనా కుట్ర ఉందా..? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. విమాన ప్రయాణం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ భద్రత దృష్ట్యా అధికారులు రాజీ పడలేదు. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Kamareddy Missing Cases: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్