గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలను తమ సొంత గ్రామమైన ముత్తోజిపేటలో నిర్వహించేందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సడలింది. అంతకుముందు పోలీసులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో బాధితుడి కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ చర్చల అనంతరం బండి సంజయ్ సహా బీజేపీ శ్రేణులు ముత్తోజిపేట నుండి వెనుదిరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
శంకర్ గౌడ్ మృతదేహాన్ని ముందుగా డిపోకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. వారి ఆవేదనకు మద్దతుగానే బీజేపీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో పాటు జేఏసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ముందే ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నేరుగా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. అయితే ఈ క్రమంలో పోలీసులు శంకర్ గౌడ్ కుమారుడిపై భౌతిక దాడికి దిగి.. బలవంతంగా అరెస్ట్ చేసి ఒప్పించారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాలని బండి కోరారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ. 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఇది బాధితులకు సాయం చేయడం కాదని.. బిక్షం వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రచార చిత్రాల్లో పాటలు పాడే వారికి కోట్లాది రూపాయలు ధారపోసే ప్రభుత్వం.. రాత్రింబవళ్లు కష్టపడే కార్మికుల విషయంలో మాత్రం పిసినారితనం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు.
ఆర్టీసీ కార్మికులకు చేతులెత్తి మొక్కుతున్నానని.. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని.. వారిని ఆదుకునే వారు ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేయడం మనకు కొత్త కాదని.. హక్కుల సాధన కోసం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం.. జేఏసీ మధ్య చర్చలు ఒకవేళ విఫలమైతే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగి కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా తక్షణమే దిగిరావాలని.. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు డిపో వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ మద్దతుగా నిలబడింది.. అంతేకానీ పబ్లిసిటీ కోసం రాలేదు
– కేంద్ర మంత్రి బండి సంజయ్
BJP stands in support of RTC driver Shankar Goud's family members demanding that he be taken to the depot..… https://t.co/MHNQXguvBQ pic.twitter.com/fUabYQn88X
— BIG TV Breaking News (@bigtvtelugu) April 24, 2026
ALSO READ: డ్రైవర్ శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు