FSL Fire Accident: స్వేఛ్చ బ్యూరో: సంచలనం సృష్టించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అగ్నిప్రమాదం సంఘటనలో సంచలన వివరాలు బయట పడుతున్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కీలక వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం ఎఫ్ఎస్ఎల్ నడుస్తున్న భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూం, కేసుల వెరిఫికేషన్ ఛాంబర్, అనాలసిస్ ఛాంబర్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. ఇక, సర్వర్ రూంలోని ఫైళ్లు కూడా దగ్ధమయ్యాయి. శనివారం ఉదయం 10.08గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. సీఐ శ్రీనివాస్ తన ఫిర్యాదులో ఆఫీస్ కు వస్తుండగా ఉదయం 10.08గంటలకు క్లాస్ ఫోర్ ఉద్యోగి సాయికృష్ణ ఫోన్ చేసి అగ్నిప్రమాదం గురించి సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆ వెంటనే తాను అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వమని సూచించినట్టు తెలిపారు. ఇంకా సిబ్బంది ఎవరైనా వచ్చి ఉంటే మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. తాను 10.25గంటల సమయానికి ఆఫీస్ కు చేరుకున్నట్టు తెలియచేశారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది మొదటి అంతస్తులో చెలరేగిన మంటలను అగ్నిమాపక పరికరాల సహాయంతో ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 10.30గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు మంటలను పూర్తిగా ఆర్పివేసినట్టు తెలిపారు. ఆ తరువాత ఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ రావు, ఇన్ ఛార్జ్ సైంటిస్ట్ ఆఫీసర్ అంజనతో కలిసి మొదటి అంతస్తును పరిశీలించినట్టు తెలిపారు. అప్పుడే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, దాని ప్రాపర్టీ రూం, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూంలలో నష్టం జరిగినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. దాంతోపాటు హెచ్ఆర్డీ హాల్, మొదటి అంతస్తులోని ఉన్న ఇతర గదులు, ఫర్నీచర్, పరికరాలు కూడా అగ్నిప్రమాదంలో దెబ్బ తిన్నట్టుగా తెలిసిందని వివరించారు. ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించ లేదని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.
Also Read: Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్
ఈ ఫిర్యాదుపై నాంపల్లి పోలీసులు కేసులు నమోదు చేయగా అసలేం జరిగిందన్నది తెలుసుకోవటానికి క్లూస్ టీం రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన మొదటి అంతస్తును సీజ్ చేసిన క్లూస్ టీం ఆధారాల కోసం నిశిత తనిఖీలు జరిపింది. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నాంపల్లి పోలీసులతో మాట్లాడగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే ఎలాంటి వివరాలను వెల్లడించ లేమన్నారు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలిసిందని చెప్పారు.
Also Read: Swayambhu Teaser: నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?