BRS Politics: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు.. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయా? కేవలం రాష్ట్ర స్థాయి నేతల వల్ల పార్టీ ఓటమ పాలైందా? స్థానిక నేతలు, కేడర్ని పట్టించుకోలేదా? త్వరలో రానున్న ఉప ఎన్నికలకు స్థానికులకు బీఆర్ఎస్ హైకమాండ్ పగ్గాలు అప్పగిస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్లో రకరకలా విశ్లేషణలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై విశ్లేషణలు మొదలయ్యాయి. గడిచిన రెండుమూడు రోజులుగా నియోజకవర్గంలోని నాయకులతో సమావేశమయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిట్టింగ్ సీటు ఓడిపోవడంతో ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఓటమి వెనుక కారణాలు తెలుసుకునే పనిలో పడింది.
కచ్చితంగా ఆ సీటు గెలుస్తామని భావించింది. ఒకవేళ లేకుంటే గట్టి పోటీ తప్పదని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు దాదాపు 25 వేల మెజార్టీ రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు ఆ పార్టీ నేతలు. ఎక్కడో తేడా కొట్టిందని నిర్థారణకు వచ్చారు.
దెబ్బ కొట్టిన ఎం.ఎన్ ఫార్ములా
జూబ్లీహిల్స్ నాయకులు, కేడర్ని ఆఫీసుకు పిలిపించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతలు ఒక్కో విషయం చెప్పేసరికి విని షాకవ్వడం ఆయన వంతైంది. ఒకానొక దశలో నియోజకవర్గం నాయకులు ఏకంగా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. గోపీనాథ్ సంతాప సభ నుంచి తమను పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారట.
ఇక అభ్యర్థి ప్రకటన తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారట. ఆనాటి నుంచి ప్రచారం ముగిసిన వరకు పెత్తనమంతా రాష్ట్రస్థాయి నేతలు చేశారని అన్నారట. మన అవసరం ఉండదని భావించి స్థానిక నేతలు, కార్యకర్తలు దూరంగా జరగడం మొదలుపెట్టారట.
ALSO READ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము, సాయంత్రానికి హైదరాబాద్కు
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూత్ ఇన్ఛార్జులు, డివిజన్ ఇన్ఛార్జులు తమపై ఆధిపత్యం చెల్లాయించినట్టు కేటీఆర్ దృష్టికి వచ్చిందట. అలా బయటి నుంచి వచ్చినవారి పెత్తనం అధికమైందని, ఎన్నికల్లో ఓటమికి అదే కారణమని తేల్చేశారట. గత్యంతరం లేక వారి వెంట నడవాల్సి పరిస్థితి వచ్చిందని, తమ వాయిస్ లేకుండా పోయిందని గోడు వెల్లబోసుకున్నారట.
మునుగోడు, నాగార్జునసాగర్ బైపోల్లో రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగారని, అక్కడ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. ఆ ఫార్ములా జూబ్లీహిల్స్ లో వర్కువుట్ కాలేదని చెబుతున్నారు. పార్టీకి మెజార్టీ వస్తుందని భావించిన వెంగళరావునగర్, బోరుబండ డివిజన్లలో పార్టీ దెబ్బతినడానికి అదే కారణమని తేల్చేశారట.
నోటిఫికేషన్ మొదలు ప్రచారం ముగిసేసరికి రాష్ట్ర స్థాయి నేతలంతా వెళ్లిపోవడంతో అసలు కథ బయటపడిందని అంటున్నారు.అలాగే పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. త్వరలో రెండు సీట్లు ఖాళీ అవుతాయని భావిస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్. వాటిలో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఎన్నిక విషయంలో ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. అందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.