Naini Coal Mines Tender: ఒడిశాలోని నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి సింగరేణి యాజమాన్యం (SCCL) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను తాజాగా రద్దు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి బిడ్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాలనాపరమైన కారణాల వల్లనే టెండర్లను రద్దు చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం అధికారికంగా ప్రకటించినప్పటికీ, దీని వెనుక తీవ్రస్థాయిలో రాజకీయ, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టెండర్ల రద్దును ధృవీకరించారు.
ఈ టెండర్ ప్రక్రియపై గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా టెండర్ నిబంధనలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చారని, పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సైతం జోక్యం చేసుకుని సింగరేణి పాలకమండలిని ప్రశ్నించింది. టెండర్ నిబంధనలపై పాలకమండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నిలదీయడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే, టెండర్ వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి పరిశీలన (Site Visit) కోసం ఇవ్వాల్సిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు నిరాకరించారు. దీనివల్ల అర్హత ఉన్న కంపెనీలు టెండర్లు వేయలేకపోయాయని, కేవలం ముందస్తుగా నిర్ణయించుకున్న సంస్థలకే మేలు చేసేలా అధికారులు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ అంతా సవ్యంగా ఉంటే ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తాయని కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణిని ప్రశ్నించింది.
నైనీ గనుల విషయంలో ఇటువంటి వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2016లో కూడా టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో అప్పట్లో కూడా ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా రెండోసారి కూడా టెండర్లు రద్దు కావడంతో నైనీ గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంలో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్ళీ వివాదాస్పద రీతిలో నోటిఫికేషన్ ఇవ్వడంపై కార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి.
Also Read: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలకు బ్రేక్? హైకోర్టు తీర్పు వాయిదాతో అభ్యర్థుల్లో మొదలైన గుబులు!
ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, సాంకేతికంగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే పాలక మండలి సమావేశమై, నిబంధనలను పునఃసమీక్షించి, పూర్తి పారదర్శకతతో కొత్త టెండర్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే ప్రభుత్వ తదుపరి ఆదేశాల వరకు వేచి చూడాల్సిందే.
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం
నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో ఇటీవల తీవ్ర ఆరోపణలు
ఆరోపణల నేపథ్యంలో టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కావాల్సిన బిడ్స్
పాలనాపరమైన… pic.twitter.com/xoQcSm85sj
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2026