HC on Group 1 Petitions: తెలంగాణలో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత రద్దయి, తిరిగి 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన తుది తీర్పును రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.
గత విచారణ సందర్భంలోనే చీఫ్ జస్టిస్ (CJ) నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల తీర్పు కాపీలు పూర్తిస్థాయిలో రూపకల్పన జరగలేదు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను, తుది నిర్ణయాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5న గ్రూప్-1 భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ వివాదంలో ప్రధానంగా 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలు, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే, TGPSC నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇప్పటికే ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు (Posting Orders) అందజేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరిన వారి పరిస్థితి ఈ తుది తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయగా, దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఆ సమయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుండి ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు అటు ఉద్యోగాల్లో చేరిన వారికి, ఇటు పిటిషన్ వేసిన అభ్యర్థులకు అత్యంత కీలకం కానుంది.
Also Read: లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి.. ఏం జరగబోతోంది?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లోని సంస్కరణలు, పరీక్షల నిర్వహణ తీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 5వ తేదీన హైకోర్టు ఇచ్చే తుది తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.
గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా
వచ్చే నెల 5న తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు
తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదన్న డివిజనల్ బెంచ్ https://t.co/cyUEJJ015x
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2026