Skill Development: స్వేచ్ఛ బ్యూరో: నాగర్కర్నూల్ గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక అడుగుగా నిలిచే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాముకు సమీపంలోని ప్రభుత్వ భవనంలో శుక్రవారం రాత్రి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవితో కలిసి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు విభిన్న రంగాల్లో ఉచిత శిక్షణ అందుతుందన్నారు. ప్రస్తుత కాలంలో విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అత్యంత అవసరమని, నైపుణ్యత పెంపొందించుకోవడం ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా కృషి చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా సుమారు 70 రకాల కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి కోర్సుకు 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, సంవత్సరానికి దాదాపు 167 బ్యాచ్ ల నిరుద్యోగ యువతీ యువకులకు కోర్సులను నిర్వహించనున్నట్లు, వివరించారు. ప్రస్తుత కాలంలో విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అత్యంత అవసరమని, నైపుణ్యత పెంపొందించుకోవడం ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు శిక్షణ అందించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని, ముఖ్యంగా స్థానిక యువత తమ ఆసక్తులకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంపిక చేసుకుని ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
Also Read: తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!
శిక్షణ పొందే అభ్యర్థులు కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా, పూర్తిస్థాయిలో శిక్షణను గ్రహించి, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని, ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అదనంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
త్వరలో రాష్ట్రంలో సమగ్ర స్కిల్ సర్వే నిర్వహించి, నిరుద్యోగుల నైపుణ్యాలను గుర్తించి, తగిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నిర్వహించబడనుండగా, స్థానిక యువతకు ఇది ఒక సువర్ణావకాశమని, యూనియన్ బ్యాంక్ అధికారులు సీఎస్ఆర్ నిధులతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, జివి శ్యామ్ ప్రసాద్ లాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, యూనియన్ బ్యాంక్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read: కొత్త పార్టీ.. కొత్త లక్ష్యం.. తెలంగాణ సీఎంని అవుతానంటున్న కవిత