SP Balu: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ నెల 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అందువల్ల, ఆయన విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక అయిన రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయొద్దని పృథ్వీరాజ్ వాదన. తెలంగాణ కళాకారులు, సాహితీవేత్తలు అయిన అందెశ్రీ, గద్దర్ లాంటి వారి విగ్రహాలకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని పృథ్వీరాజ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటును తాను ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదంపై ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు స్పందించారు. ఎస్పీబీ బావమరిది, సినీ నటులు శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్, శుభలేఖ సుధాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠాపనపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. కళాకారులకు ప్రాంతీయ బేధాలు లేవని.. సంగీతం విశ్వజనీనమని సుధాకర్ వాదించారు. అయినప్పటికీ, పృథ్వీరాజ్ తన పట్టు వీడలేదు.
ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘గొప్ప కళాకారుల విషయంలో కూడా ప్రాంతీయ బేధాలా?’ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ బాలు భారతీయ సంగీతానికి చేసిన సేవలు అపారం. అటువంటి వ్యక్తి విగ్రహం ప్రతిష్ఠిస్తే కూడా ఇన్ని అడ్డంకులా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళకు, కళాకారుడికి రాష్ట్రాలు, సరిహద్దులు ఉండవని.. ఎస్పీబీ విగ్రహ స్థాపన మంచి పరిణామమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ కళాకారులను గౌరవించాలని డిమాండ్ చేయటంలో తప్పు లేదనీ.. అయితే, ఎస్పీ బాలు విగ్రహాన్ని అడ్డుకోవటం సరైంది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లు కొనసాగుతుండగా.. పృథ్వీరాజ్ ఆందోళన నేపథ్యంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రవీంద్ర భారతిలో నెలకొన్న ఈ ఉద్రిక్తత, కళాకారుల గౌరవం విషయంలో ప్రాంతీయ అంశాలు ఎంతమేర ప్రభావం చూపుతాయో తేల్చే అవకాశం ఉంది.