Kadiyam Srihari vs Rajaiah: స్టేషన్ ఘన్పూర్లో కడియం వర్సెస్ రాజయ్యగా డైలాగ్ వార్ ముదురుతోంది. ఇటీవలి కాలంలో ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం శిఖరానికి చేరింది.
KTRను టార్గెట్ చేస్తూ నిన్న కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. నీకు MLA పదవి.. ఎవరు రాసి ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. నువ్వు, నీ బిడ్డ పార్టీ ఫండ్ తీసుకొని అమ్ముడుపోయారని ఆరోపించారు. నిన్ను తిట్టే హక్కు బరాబర్ BRS పార్టీకే ఉంది.. దమ్ముంటే MLA పదవికి రాజీనామా చేయ్ అంటూ సవాల్ విసిరారు. ఘన్పూర్ గడ్డపై నువ్వో.. నేనో తేలాలి.. చూసుకుందాం రా.. కబడ్డీ.. కబడ్డీ ఆడుదాం రా అంటూ సవాల్ విసిరారు రాజయ్య. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచామని విర్రవీగుతున్నారు కదా.. రా.. స్టేషన్ ఘన్పూర్లో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. నువ్వు స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ నీ పేరు పలకనని ఛాలెంజ్ చేశారు.
ఈ మాటలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ కలకలం రేపాయి. అధికారం చేతిలో ఉన్నవారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలా? లేక ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు దిగాలా? అనే చర్చ మొదలైంది.
రాజయ్య మరో ఆసక్తికర అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా హక్కు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అధికారంలో ఉన్నవారు విమర్శలను భరించాలి. ప్రశ్నించినందుకే ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు. ఇది కేవలం వ్యక్తిగత గొడవ కాదని, ప్రజల తరపున పోరాటమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: రాజ్యాంగ స్ఫూర్తి పై అవగాహనకు 5కే రన్.. ఏక్ నయీ దిశ ఫౌండేషన్ వినూత్న ప్రయత్నం
ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎవరి వైపు ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుందన్నది ప్రధాన చర్చాంశంగా మారింది. ఒకవైపు అభివృద్ధి పేరుతో సవాళ్లు, మరోవైపు నైతికత పేరుతో ప్రతివిమర్శలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. రాజయ్య చేసిన ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం అనే వ్యాఖ్య రాజకీయంగా కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.