Jangaon District: జనగామ, స్వేచ్ఛ: నీ జతలేక.. పిచ్చిది కాదా… మనసంతా.. అని ఓ సిని కవి రాసినట్లుగానే పులి కథ ఉంది. తన తోడు లేక ఏమి చేయాలో తెలియక పిచ్చిపట్టినట్లుగా దారి తెన్ను తెలియక అది తిరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. లేగదూడలను చంపుతూనే ఉన్న పులి ఇప్పుడు జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లాలోకి వెళ్లినా అది తిరిగి మళ్ళీ జనగామ జిల్లాలోకి రాకుండా పోదనే భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. పులి తన జత కోసం వేట కొనసాగిస్తూనే గేదేలను చంపుతూనే ఉంది. శుక్రవారం రఘునాథపల్లి మండలం మండలగూడెంలో కనిపించిన పులి చాయలు, శనివారం తెల్లవారజామున నర్మెట్ట మండలం అమ్మాపురంలో రెండు లేగదూడలను చంపింది. ఓవైపు పులి వేటతో జనాలు బేజారు అవుతుంటే.. ఇప్పుడు కొత్తగా హైనా అనవాల్లు కలనిపించడంతో జనాలు హడలెత్తుతున్నారు. పులి బాధ పోయిందని సంతోషిస్తున్న రఘునాథపల్లి మండల ప్రజలకు హైనా రూపంలో కొత్త భయం పట్టుకుంది.
పెద్దపులి వేట జిల్లాలో జోరుగా సాగుతుంది. పులి తన జత కోసం సాగిస్తున్న ప్రయాణంలో లేగదూడలను చంపి తింటుంది. ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి ప్రాణ హాని కలిగించలేదు. పులి కోసం ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పులిని పట్టుకునేంతవరకు ఫారెస్ట్ అధికారులకు అండగా, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏకంగా వరంగల్ కమీషనర్ సన్ప్రీత్ సింగ్ నేరుగానే కార్యచరణలోకి అడుగుపెట్టారు. పులి గురించి వివరాలు తెలుసుకునేందుకు సీపీ రఘునాథపల్లి పోలీస్స్టేషన్ సందర్శించారు. సీపీ ఆదేశాలతో డీసీపీ రాజామహేంద్ర నాయక్ పులి సంచరించిన ప్రదేశాలను, దాని అడుగుజాడలను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల సాయంతోనే ఎక్కువగా పులి ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో ఉన్నారు. రఘునాథపల్లి మండలం నుంచి అది నర్మెట్ట మండలంలోని అమ్మాపురం వెళ్లింది. అక్కడ రెండు లేగదూడలను చంపి, ఆపై అది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.
రఘునాథపల్లి మండలం మండలగూడెంలో లేగదూడను చంపిన పులి అటు నుంచి సిద్దిపేట జిల్లాలోకి వెళ్ళిందని సంతోష పడుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెవిన పడింది. ఇప్పుడు హైనా లేగదూడలపై దాడి చేసి చంపడం మండలంలో కలకలం రేగుతుంది. రఘునాధపల్లి మండలం రామచంద్రాపురం శివారు లక్ష్మీతండాలో ఓ రైతుక ఉచెందిన దూడలను హైనా చంపిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. హైనా రూపంలో మరో ప్రమాదం పొంచి ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో హైనాలు గతంలోనూ తిరిగినట్లు ప్రజలకు చర్చించుకుంటున్నారు. హైనాలు గతంలో గోవర్ధనగిరి గ్రామంలో గర్వందుల లక్ష్మయ్యకు చెందిన పశువులను చంపి తిన్నట్లు చెపుతున్నారు.
పులి జనగామ జిల్లాను దాటిందని సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని ఫారెస్ట్ శాఖ జిల్లా అధికారి లావణ్య తెలిపారు. పులి అడుగు జాడల ఆధారంగా రఘునాథపల్లి మండలం నుంచి నర్మెట్ట మండలంలోని అమ్మాపురం వెళ్ళిందని అన్నారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వెళ్ళిందన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్ళిందని, అక్కడి నుంచి జనగామ జిల్లాకు వచ్చిన పెద్దపులి తిరిగి ఇప్పుడు సిద్దిపేటకు వెళ్ళిందన్నారు. పులి జిల్లా దాటిందని, కానీ తిరిగి ఎప్పుడైనా మళ్ళీ జిల్లాలో అడుగు పెట్టవచ్చవనే సందేహాలు వ్యక్తం అవుతున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమే సూచించారు.