తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 246 పీజీ మెడికల్ సీట్లు తెలంగాణలో మిగిలిపోయిన 377 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రైవేట్ వైద్య కళాశాలల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ గడువును పెంచాలని విజ్ఞప్తి చేశాయి. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత కొత్తగా సీట్లు భర్తీ చేయడం సాధ్యం కాదని పేర్కొంటూ హైకోర్టు గతంలో పిటిషన్లను తిరస్కరించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయంతో ఏకీభవించింది. గడువు పెంపు విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
అయితే ఈ సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు న్యాయస్థానం సూచించింది. ఖాళీ సీట్ల వివరాలను పరిశీలించి మెరిట్ ప్రాతిపదికన తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ చట్టపరమైన నిబంధనలకు లోబడి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. జస్టిస్ పి.ఎస్. నరసింహ జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. ఈ పరిణామంతో ఖాళీ సీట్ల భర్తీ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళింది.
ALSO READ: Supreme Court: తప్పుడు ఫిర్యాదులు.. ఫోర్జరీ సాక్ష్యాలపై.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం