Salvo industries :
⦿ అడ్రస్ లేని అడ్డగోలు ఫ్యాక్టరీకి పేలుడు పదార్థాల టెండర్
⦿ పిలిచిన టెండర్ రద్దు చేసిమరీ కబ్జాదారుల కంపెనీకిచ్చిన సింగరేణి
⦿ మైనింగ్కు వాడేవి వద్దట.. ప్రాజెక్ట్స్కు వాడేవైనా చాలట
⦿ టెండర్ల అంశంలో చక్రం తిప్పిన మంత్రి
⦿ కనీస అనుమతులు లేని కంపెనీ రూ.155 కోట్ల మెటీరియల్ సప్లై చేస్తుందా?
⦿ అక్రమ దందాలు పొక్కకుండా అర్ధిక వనరులతో ఎర?
⦿ పక్కదారి పడుతున్న పేలుడు పదార్ధాలపై ఫోకస్ ఉందా?
⦿ ఓఆర్ఆర్కు కూతవేటు దూరంలో ఉన్న గుట్టల్లో ఏం జరుగుతోంది?
⦿ సాల్వో ఎక్స్ప్లోజివ్స్కు సపోర్ట్ చేస్తున్నది ఎవరు?
⦿ అక్రమాలపై హైడ్రా అంటున్న వారికి ఈ బడా కంపెనీ కబ్జాలు కనిపించడం లేదా?
⦿ గుట్టల్లో గుట్టుచప్పుడు వ్యవహారాలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పేలుడు పదార్ధాల తయారీ కంపెనీ అంటే ఎలా ఉండాలి. కట్టుదిట్టమైన చర్యలతో ఏ ప్రమాదం జరగకుండా అన్ని అనుమతులతో ఇండస్ట్రీ జోన్లో ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఓఆర్ఆర్కి సమీపంలో కీసర గుట్టల దగ్గర అడ్డాగా మార్చుకుని దందాలు సాగిస్తున్నారు. జీరో అనుమతులతో 80 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారు. సాల్వో ఎక్స్ప్లోజివ్స్ అండ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాగోతంపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం స్టింగ్ ఆపరేషన్ చేసింది. దీంతో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని ప్రభుత్వ భూమి కావడం ఈ కంపెనీ ఓనర్ జైరాం రెడ్డికి వరంగా మారింది. ఒక్క భూ వ్యవహారమే కాకుండా అందరినీ మేనేజ్ చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కంపెనీకి సింగరేణి సంస్థ రూ.155 కోట్ల టెండర్స్ని అప్పగించడంపై అనేక విమర్శలకు తావిస్తోంది.
టెండర్స్ కథేంటి?
ఎస్సీసీఎల్ (సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) మైనింగ్ వెలికి తీసేందుకు పేలుడు పదార్ధాల సప్లైకి టెండర్స్ పిలిచింది. 10 ఏరియాలకు గాను 20 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్స్కి 155 కోట్ల పేలుడు మెటీరియల్ రెండేళ్లు ఇవ్వాల్సిందిగా టెండర్స్ ఖరారు చేసింది. ఈ నెలాఖరుకు గత టెండర్స్ ముగుస్తున్నాయి. దీంతో 2024 మార్చి 27న టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో గతంలో సప్లై చేసినట్లు అర్హతలు, అనుభవం, కెపాసిటీ, టెండర్ కాలపరిమితి, సమయానుకూలం అన్నీ వర్తింపజేశారు. కానీ, అనివార్య కారణాలతో ఆ టెండర్స్ని రద్దు చేశారు. మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్ 24న కొత్త టెండర్స్ పిలిచారు. వాటి మార్గదర్శకాలు, అర్హత, సిఫార్సులు అన్నింటినీ మార్చేశారు. బిడ్డర్లు వారి పేలుడు పదార్ధాల సామర్ధ్యం ఎస్సీసీఎల్ లేదా సీఐఎల్లో విజయవంతంగా పరీక్షించుకొని లైసెన్స్ కలిగి ఉండాలి. కానీ, ఈ అర్హత సంతృప్తికరంగా లేకుండానే ఇతర పీఎస్యూ, ప్రభుత్వ, సీపీఎస్యూ లాంటి చిన్న చిన్న ప్రాజెక్టుల కోసం అర్హత కలిగిన పేలుడు పదర్ధాలకు అనుకూలంగా ఉన్న వాటికి అవకాశం కల్పించేలా కొత్త టెండర్స్ పొందు పర్చారు. కొత్త వారు పాల్గొనడానికి గతంలో 25 శాతం సప్లై కెపాసిటీ కలిగి ఉండాలి. తాజా టెండర్స్లో 10 శాతం కలిగి ఉన్నా సరిపోతుందని కేవలం జైరాం రెడ్డికి చెందిన కంపెనీకి టెండర్ దక్కేలా వ్యవహరించారు. ఎస్ఎంఈ 4 లక్షల 38 వేల 889 మెట్రిక్ టన్నులు, ఎల్డీసీ ఎక్స్ప్లోజివ్ 33వేల 696 మెట్రిక్ టన్నులు సప్లై చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్ కంపెనీ కబ్జా చేసుకుని నడిపిస్తున్న ఫ్యాక్టరీలో అంత కెపాసిటీ లేదు. కానీ, ఓ కీలక మంత్రి అంతా సాఫీగా సాగేలా, టెండర్ దక్కేలా ప్లాన్ వేశారు. రూ.155 కోట్ల పేలుడు పదార్ధాలు సప్లై చేసేందుకు అవకాశం కల్పించారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో!
సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్ కంపెనీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులకు అర్ధిక వనరులు సమకూర్చుతూ పబ్బం గడుపుతుంటుంది. కంపనీ భూదందాను రెగ్యులరైజేషన్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. 20 ఏండ్లుగా కాని ఈ భూ పరిష్కారాన్ని తాము చేయిస్తామని సర్వే నెంబర్ 918ని ఖతం చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు హామీలు ఇవ్వడంతో ఆ భూమిపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఆరా తీసింది. కంపెనీలో జరిగే అర్ధిక, అనుమతుల, రక్షణ, సరఫరా లాంటి వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టింది.
హైడ్రా స్పందిస్తుందా? తర్వాతి కథనంలో మరిన్ని సంచలనాలు
అక్రమాలపై ఉక్కుపాదానికి హైడ్రాను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే పేలుడు పదార్ధాల కంపెనీపై ఎందుకు స్పందించడం లేదు? దీని వెనుక ఉన్న నేతలు ఎవరు? ఇప్పుడు వారంతా ఏం చేస్తున్నారు? దందా ఎలా నడిపించాలనుకుంటున్నారో తర్వాతి కథనంలో చూద్దాం.