ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటానని.. గ్రామాభివృద్ధికి పాటుపడతానని ప్రజాప్రతినిధులు ప్రమాణం చేయడం ఆనవాయితీ. అయితే, జనగామ జిల్లాలో జరిగిన ఒక ప్రమాణ స్వీకారోత్సవం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. బాధ్యత పట్ల ఆ మహిళా సర్పంచ్కు ఉన్న అంకితభావాన్ని చాటిచెప్పింది. అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్కే పరిమితమైనా.. తన కర్తవ్యాన్ని విస్మరించకుండా అంబులెన్స్లోనే సర్పంచ్గా ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు.
జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికయ్యారు. అయితే.. దురదృష్టవశాత్తూ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు అత్యవసర సర్జరీ (శస్త్ర చికిత్స) నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆమె కనీసం బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెకు విశ్రాంతి తప్పనిసరని సూచించారు.
ఈ రోజు నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారానికి గడువు ఉండటంతో.. అలేఖ్య తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ.. గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఆమె అంబులెన్స్లోనే గ్రామానికి చేరుకున్నారు. స్ట్రెచర్ పై పడుకుని ఉన్న స్థితిలోనే ఆమెను అధికారులు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తీసుకువచ్చారు.
వెంకిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి సౌమ్య పాల్గొన్నారు. అంబులెన్స్ బెడ్ పై ఉన్న అలేఖ్య చేత ఆమె సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించారు. తన ఆరోగ్యం కంటే ప్రజా సేవయే మిన్న అని నిరూపించిన అలేఖ్యను చూసి గ్రామస్తులు, అక్కడికి వచ్చిన వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది.
ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా.. తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం అలేఖ్య చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె చేసిన ఈ ప్రమాణ స్వీకారం ఇతర ప్రజాప్రతినిధులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్తులు కొనియాడారు.
ALSO READ: Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు