BRS Activists: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం వేదికగా తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన వ్యక్తమైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి సమక్షంలోనే ఉద్యమకారులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.
ఉద్యమకారుల నిర్లక్ష్యం..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమలాంటి ఉద్యమకారులను పార్టీ నాయకత్వం పూర్తిగా విస్మరించిందని వారు మండిపడ్డారు. సమావేశాలకు పిలిచినా కనీస గౌరవం ఇవ్వడం లేదని, స్టేజిపైకి ఆహ్వానించడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టి పార్టీలు, కండువాలు మార్చుకుని వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం కల్పించడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటేనని ఆరోపించారు.
కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి..
ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పదవులు, బాధ్యతలు అప్పగిస్తుండగా, పార్టీ కోసం పోరాడిన ఉద్యమకారులను విస్మరించడం సరైన విధానం కాదని ప్రశ్నించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డికి ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల గురించి ఎంత అవగాహన ఉందని నిలదీశారు. ఇకపై ఉద్యమకారుల విషయంలో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుని తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని ఉద్యమకారులు ప్రవీణ్, సంజీవరావులు కోరారు. తమ గోడును మీడియా ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Also read: ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?