Kavitha: స్వేచ్ఛ బ్యూరో: ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి, పెన్షన్ ను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి భూమిని ఆక్రమించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం చలో సెక్రటేరియట్ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకొని మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
విషయం తెలుసుకున్న కవిత.. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచే ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులతో ఫోన్ లో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారందరినీ విడిచిపెట్టే వరకు తాను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్ చేసిన ఉద్యమకారులందరినీ విడిపించారు.
Also Read: బచ్చన్నపేటలో బెల్ట్ షాపుల జాతర.. వైన్స్లో లేని స్టాక్ అక్కడ ఫుల్..?
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ లీడర్లు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పెన్షన్ సహా ఇతర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్య మకారులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కలేదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లతో పాటు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ఉద్యమకారుల కోసం బిల్లు పెడతామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఉద్యమకారులకు వారి హక్కులను సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే భూ పోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో భూ పోరాటాలు ప్రారంభించిందని.. మున్ముందు ఉద్యమకారులతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Also Read: రాయలసీమ స్పెషల్ నాటు కోడి పులుసు.. రాగి సంకటిలోకి అదిరిపోయే రుచి!