Advocate Protection: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో గొప్పదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాయవాదులపై దాడులు పెరిగినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనిలో వామనరావు దంపతుల హత్యతో న్యాయవాద లోకం కలచివేసిందని, ఇటీవల ఇద్దరు యువ న్యాయవాదుల హత్యలు చోటుచేసుకోవడంతో రక్షణ చట్టం అవసరం మరింత తీవ్రంగా వ్యక్తమైందన్నారు.
నవంబర్ 9న ఆలంపూర్ బార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్ర భూత్పూర్ చేరుకునే సరికి విస్తృత మద్దతు లభించిందని తెలిపారు. దీనిపై స్పందించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు ముఖ్యమంత్రితో చర్చించి చట్టం తీసుకురావాలని హామీ ఇవ్వడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు చెప్పారు. అయితే వంద రోజులు గడిచినా స్పందన రాకపోవడంతో భూత్పూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రను మళ్లీ ప్రారంభించామని తెలిపారు. పాదయాత్ర ముగింపు రోజు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరించగా, త్వరలోనే చట్టం తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Also Read: ముఖంపై మృతకణాలు తొలగించడానికి ఇంట్లోనే సూపర్ ఫేస్ ప్యాక్.. నిగనిగలాడే చర్మం మీ సొంతం
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే బడ్జెట్ సమావేశాల్లో న్యాయవాద రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కృషి చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లకు న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also read: డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్లే టార్గెట్.. ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ మంచు విష్ణు!