TG Panchayat Raj: స్వేఛ్చ బ్యూరో: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 1న స్వేచ్ఛ దినపత్రికలో ఏడాదైనా ఎదురుచూపులే.. ఎంపీడీఓలకు ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్ అనే కథనాన్ని ప్రచురించింది. మంత్రి సీతక్క సైతం చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలో ప్రమోషన్లు అప్రూవ్ అయ్యాయి. అధికారికంగా ఒకటిరెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 27 మంది డిప్యూటీ సీఈఓలు సీఈఓలుగా , 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి లభించింది. సుదీర్ఘకాలంగా పదోన్నతులు కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
పదోన్నతులు పొందిన అధికారులు శుక్రవారం ప్రజా భవన్లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, అర్హత కలిగిన వారికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. శాఖ బలోపేతం కావడంతోప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఈఓలుగా, 15 మంది డిప్యూటీ సీఈఓల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు.
ఎంపీడీవోల నుంచి అటెండర్ ల వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో మొదటిసారిగా అత్యధిక స్థాయిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా శాఖను బలోపేతం చేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పరిపాలన మరింత మెరుగుపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీఓ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Yllampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు