Beerla Ilaiah Comments: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి అటెనెన్సు కోసం వస్తున్నాడా? లేక సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతో వస్తున్నాడా? అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఇప్పుడు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ గతంలో చేసిన పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని.. బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. మీ మోసాలను అసెంబ్లీలో చర్చిద్దాం. అన్ని విషయాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ కూడా ధైర్యంగా చర్చలకు రావాలి అని సవాల్ విసిరారు. అయితే కేసీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, సభా గౌరవాన్ని కాపాడేలా మాట్లాడాలని సూచించారు.
నల్లగొండ ఉసురు తగిలే కేసీఆర్ పామ్ హౌస్కే పరిమితమయ్యారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల అంశంపై కూడా కేసీఆర్ను ప్రశ్నించారు. కృష్ణా జలాలు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు? అంటూ నిలదీశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. మీ పదేళ్ల పాలనను, మా రెండేళ్ల పాలనను ప్రజల ముందు పెట్టి చర్చిద్దాం అని అన్నారు. ప్రజలు ఇప్పటికే కేసీఆర్ను ఛీకొట్టారని, ఆయన వక్రబుద్ధి ఇంకా మారలేదని విమర్శించారు.
పార్టీ పిరాయింపుల అంశంపై కూడా బీర్ల ఐలయ్య తీవ్రంగా స్పందించారు. పార్టీ పిరాయింపులకు పెద్దన్న కేసీఆర్, హరీష్ రావు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని, సంతలో పశువులను కొన్నట్లు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
గ్రామస్థాయిలో కేసీఆర్, కేటీఆర్ చిల్లర భాషలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు, యువకులు తీవ్రంగా మోసపోయారని, ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మీ పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగ యువత అష్టకష్టాలు పడ్డారు అని అన్నారు.
సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, మళ్లీ అదే సెంటిమెంట్ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో సీట్లు సరిగా రాలేదన్న అసంతృప్తితో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మీరు ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న సమయంలో చేయని పనులను.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తుండడం మీకు బాధగా ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించి సభా మర్యాదలు కాపాడాలని సూచించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో వంతు స్థానాలు గెలిచిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. మొత్తం మీద బీర్ల ఐలయ్య వ్యాఖ్యలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసే సంకేతాలుగా మారాయి.