Telangana Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత అధికార పార్టీపై ఎదురుదాడికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగనున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల్లో కొత్త అస్త్రాలు
వెనుకుండి పార్టీని నడిపించాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన నందినగర్ నుంచి ఫామ్హౌస్కి వెళ్లిపోయారు. అంతేకాదు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీలో వాయిస్ రైజ్ చేసే నేతలను ఎంపిక చేసుకున్నారు. హరీష్రావు, సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు బాధ్యతలు అప్పగించారు.
సభలో ఏ విధంగా వ్యవహరించాలి? పార్టీ తరపున వాయిస్ ఏ విధంగా రైజ్ చేయాలి? ఎలాంటి సమయంలో బాయ్కట్ లేదా వాకౌట్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి? అనేదానిపై ఫ్లోర్ లీడర్లతోపాటు మిగతా ఎమ్మెల్యేలకు బుధవారం సాయంత్రం కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు.
అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ద్విముఖ వ్యూహం
నీటి ప్రాజెక్టులపై అధికార పార్టీ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి సహా మంత్రులు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు పక్కాగా స్కెచ్ వేశారట కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో పీపీ జరగకూడదన్నది బీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఏకాకి చేయాలని డిసైడ్ అయ్యారట.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల పంపకాలపై విస్తృతంగా చర్చ జరిగేలా ప్లాన్ చేసిందట బీఆర్ఎస్ హైకమాండ్. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రాజెక్టులపై ముందుగా తమ వాదనలు వినిపించాలని భావిస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై డిమాండ్ చేసింది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం అధికార పార్టీ మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడూ అదే జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు మాట. ఆ నేపథ్యంలో వివిధ అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ALSO READ: పక్కకు చూస్తున్న గులాబీ సీనియర్లు.. ఆ భయం వల్లేనా?
బీఆర్ఎస్ అదే పంథాను అనుసరించడం ఖాయమని అంటున్నారు. లేకుంటే సస్పెండ్ అయ్యేవరకు సభలో గొడవ చేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. ఏదో విధంగా సభ నుంచి బయటకు వచ్చి పార్టీ ఆఫీసులో సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ధీటుగా తమ పార్టీ ఆఫీసులో పీపీ ఉండేలా ప్లాన్ చేశారట. బీఆర్ఎస్- కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కేటాయింపులను బయట పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఇక్కడి నుంచి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో చేపట్టబోయే భారీ సభల తేదీలను ప్రకటించాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. తాము ఇవ్వబోయే పీపీ గురించి తెలంగాణ సమాజం మాట్లాడుకునేలా చేయాలన్నది గులాబీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు వేడెక్కడం ఖాయం.