సమావేశాల తొలి రోజున ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంతాపం ప్రకటించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నారు. శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో దివంగత ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాప తీర్మానాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం సభను వాయిదా వేయనున్నారు. ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం సూచించే రోజుల సంఖ్యకు భిన్నంగా, కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. సమావేశాల కోసం ఆయన ఇప్పటికే ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ హాజరుతో సభలో ప్రతిపక్ష స్వరం మరింత గట్టిగా వినిపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణ, గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జరగనుంది. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడంపై.. చర్చ జరగాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
ప్రభుత్వం కూడా ఈ చర్చకు సిద్ధమవుతోంది. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై బీఏసీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉండగా, ఈ సమావేశాల్లో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వీటిపై ప్రతిపక్షాలు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. సభను హుందాగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా నడిపించుకుందామని ఆయన కోరారు. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. ధరల పెరుగుదల, రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది.
Also Read: ఈ ఒక్క ఏడాదిలోనే రూ.239.37 కోట్ల చలాన్లు.. ఇకనైనా హైదరాబాద్ పబ్లిక్ మారతారా?
మొత్తంగా చూస్తే, ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు, కీలక నిర్ణయాలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది.