Bhu Bharati: ధరణి తెచ్చిన భూ భారతికి కష్టాలు
–భూ రికార్డులకు ఆన్లైన్ లోని విస్తీర్ణంతో పొంతన లేదు
–రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో పెరిగిన భూ విస్తీర్ణం
–ప్రస్తుతం భూ భారతిలో ఆర్ఎస్ఆర్ కండిషన్ తప్పనిసరి
–దీంతో దరఖాస్తుల పరిష్కారానికి యేండ్లు సమయం
–కలెక్టర్ లాగిన్ వచ్చే వరకు తెలియని సమస్య
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: భూ సమస్యలు పరిష్కారానికి ఆన్లైన్ విధానం సులభంగా ఉంటుందని గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం కంటే వివాదాలే పెరిగిపోయాయనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తా మని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుటకన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కూడా రైతులకు పెద్దగా ప్రయోజనం లేదనే ప్రచారం సాగుతుంది. కేవలం అధికారిక వికేంద్రీకరణ జరిగింది. పని విభజన మాడ్యూల్స్ కు అనుగుణంగా అధికారులకు అప్పగించారు. కానీ భూ విస్తీర్ణంలోని మార్పులు, ధరణిలో, భూ భారతిలో అప్లోడ్ చేయకుండా వదిలేసిన సర్వే నెంబర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వీటికి పరిష్కారానికి యేండ్ల సమయం పట్టడం ఖాయం.
ఆర్ఎస్ఆర్ కండిషన్ మస్ట్..
రెవెన్యూ శాఖలో కొలక్కిరాని భూ విస్తీర్ణ ప్రక్రియ. గతంలో ధరణి వెబ్ సైట్లో ఒక సర్వే నెంబర్లోని విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆన్లైన్లో నమోదు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలతో నేడు దరఖాస్తుదారులు నిత్యం అరిగోస పడుతున్నారు. విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధివిధానాలు తీసుకొచ్చినప్పటికీ మిస్సింగ్ సర్వే నెంబర్, భూ విస్తీర్ణం పెంపు, తగ్గింపు సవరణలు చేయడం అధికారులకు కష్టంగా మారిపోయింది. గత నాలుగు నెలలుగా ఆర్ఎస్ఆర్ కండిషన్ మస్ట్ చేస్తూ చట్టం ప్రక్షాళన చేశారు. దీంతో అంత సులభంగా దరఖాస్తులు పరిష్కారం అయ్యే పరిష్కారం లేదు. ఈ కారణం కూడా కలెక్టర్ లాగీన్ అయ్యే వరకు తెలియని పరిస్థితి. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ హోదాల్లో మాడ్యూల్ పరిష్కారం కోసం పని విభజన చేశారు. కానీ తహశీల్ధార్ నుంచి అదనపు కలెక్టర్ వరకు ఫైల్ ఫార్వర్డ్ చేయడం.. ఆ తర్వాత కలెక్టర్ లాగాన్ అయ్యాక మాత్రమే దరఖాస్తు రిజెక్ట్కు కారణం తెలుస్తుంది. దీంతో నెలల కొద్దిగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
Also Read: Venous Disease: రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే .. ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయ్
భూ విస్తీర్ణం పెరిగిపోవడంతో నిజమైన లబ్ధిదారులకు సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో భూ ధరలు అధికంగా ఉండటంతో ధరణిలోని లోసుగులను సానుకూలంగా మల్చుకున్న సందర్భాలున్నాయి. గతంలో భూములు విక్రయించిన రైతులే తిరిగి సక్సేషన్ చేయించుకున్న సంఘటనలున్నాయి. వీటితో ఇష్టానుసారంగా భూ విస్తీర్ణం పెరిగిపోయింది. కొనుగోలు చేసిన వ్యక్తులు మ్యూటేషన్ చేసుకోకపోవడంతో అలాగే పెండింగ్ అయ్యిపోయాయి. ప్రస్తుత పరిస్థితిల్లో భూమి రిసర్వే చేసేందుకు ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పహాణీల ఆధారంగా సర్వే నెంబర్లోని సబ్ డివిజన్లో విస్తీర్ణం దరఖాస్తుదారులోని వివరాలను క్షుణంగా పరిశీలించి కారణం సూచిస్తూ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కారణం ఆధారంగా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా లబ్ధిదారులు తంటాలు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఆర్ఎస్ఆర్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి దరఖాస్తుకు ఎంజాయెంట్ సర్వే జతపర్చాలని అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖస్రా,చెసాలా, సేత్వర్లో ఓరిజనల్ ఎక్స్టెంట్ ఆధారంగానే దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. భూ భారతిలోని విస్తీర్ణం, భూ రికార్డులో తేడా ఉంటే ఎంజాయ్మెంట్ సర్వే తప్పనిసరిగా నివేదికతో పాటు పంపాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఎంజాయ్మెంట్ సర్వే పంపాలని లబ్ధిదారులు దరఖాస్తు పరిష్కారంపై ఆరా తీస్తే అదనపు కలెక్టర్ సమాధానం ఉంటుంది. అదే అధికార పార్టీ రాజకీయ నాయకులు చెప్పిన వాటికి ఏలాంటి కోర్రిలు లేకుండా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు భాగా వినిపిస్తున్నాయి. అత్యధికంగా అదనపు కలెక్టర్ లాగిన్లోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ కార్యాలయాంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే ప్రచారం ఉంది. వచ్చిన కొత్తలో సమయం ఇవ్వాలని బహిరంగంగా పోస్టర్ డోర్కు అంటించారు. వచ్చి ఏడాది కావోస్తున్న పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ పై దృష్టి పెట్టడం లేదని సమాచారం. లబ్ధిదారులు వెంటపడి అడిగితే ఇక ఆఫైల్ రిజెక్ట్ అవుతుందనే ప్రచారం కూడా నడుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ వద్దే దరఖాస్తులు నిలిచిపోతున్నాయని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.