Cabinet Expansion: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న మంత్రివర్గ విస్తరణ ఎపిసోడ్ ఎట్టకేలకు క్లైమాక్స్ దశకు చేరుకుంది. రాబోయే పది రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల శాఖలను అటుఇటుగా మార్చే (పోర్ట్ఫోలియో షఫ్లింగ్) భారీ కసరత్తుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర అగ్రనేతలు జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో, ఈ మేరకు స్పష్టమైన క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.
ఈ పరిణామంతో అటు కొత్తగా మంత్రి పదవులను ఆశిస్తున్న లీడర్లలో ఉత్సాహం పెరుగుతుండగా, ఇటు తమ శాఖలు ఎక్కడ మారిపోతాయోనన్న ఆందోళనతో ప్రస్తుత మంత్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అధిష్టానం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే రాజకీయ, పరిపాలనా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే తుది జాబితాకు క్లియరెన్స్ ఇవ్వడంతో, సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. విస్తరణతో పాటు సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా, పరిపాలనలో మరింత వేగం పెంచేలా కొన్ని కీలక శాఖల మార్పులు కూడా ఈ విడతలోనే పూర్తి చేయాలని అధిష్టానం గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: Medchal Crime: అల్వాల్లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!
ఈసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. ప్రధానంగా ఎస్టీ (గిరిజన), బీసీ కోటాలతో పాటు ఆప్షనల్గా ఓసీ కోటాను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు కీలక నేతల పేర్లు ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గిరిజన సామాజిక వర్గం నుంచి రామచంద్రునాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ , ఖమ్మం జిల్లాల సమీకరణాలు, గిరిజన ఓటు బ్యాంకునే లక్ష్యంగా ఆయనకు ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.ఇక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు బీసీ కోటాలో బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ కోసం కట్టుబడి పనిచేసిన సీనియర్ కావడంతో పాటు, బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేతగా ఆయనకు కేబినెట్లో చోటు దక్కడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఓసీ కోటా కింద రేసులో ముందంజలో ఉంది. ఆయన సీనియారిటీ, దూకుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాల దృష్ట్యా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్.అంతేగాక గతంలో హైకమండ్ హామీ కూడా ఇచ్చింది. దీంతోనే ఆయకు ఈ దఫా బెర్త్ కన్ఫామ్ అనే చర్చ ఉన్నది.
ఈ ముగ్గురు లీడర్లతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మరికొందరు సీనియర్ల పేర్లు కూడా చివరి నిమిషంలో పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది.ఇక నిజామాబాద్ జిల్లాల నుంచి కీలక బీసీ నేతలకు ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో కూడా సర్కార్ ఉంది.మరోవైపు రెడ్డి సామాజికవర్గం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. దీంతో పాటు పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా రేసులోనే ఉన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, జిల్లా సమీకరణలు, పార్టీ పరిస్థితులు ఆధారంగా బెర్తులను ఫైనల్ చేయనున్నారు. ఇక కొత్తవారిని చేర్చుకోవడం ఒకెత్తయితే, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చడం ఇప్పుడు కాంగ్రెస్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా మారింది. కొందరు మంత్రుల పనితీరుపై వచ్చిన నివేదికల ఆధారంగా, మరికొందరు సీనియర్లకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: పెట్రో ధరలు పెరిగినా డోంట్ కేర్.. మే కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!