రాష్ట్రంలో మూడేళ్ల క్రితమే వంతెనల నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్లు లేక అవి నిరూపయోగంగా మారడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావాలంటే పనుల్లో వేగం పెరగాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రతిపాదనలు పంపే విధానంలో మార్పులు రావాలని ఆయన అధికారులకు సూచించారు. వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు 1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు అందజేస్తే వాటిని సబ్ కమిటీ క్షుణ్ణంగా చర్చించి త్వరితగతిన ఆమోదం తెలుపుతుందని వివరించారు. సరైన పద్ధతిలో నివేదికలు ఇస్తే పరిపాలన అనుమతులు ఇవ్వడం సులభం అవుతుందని తద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన అత్యంత కీలకమని సబ్ కమిటీ అభిప్రాయపడింది.
రానున్న వర్షాకాలం దృష్ట్యా రవాణా సౌకర్యాలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 8వ తేదీ లోపు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు. ఈ పనుల ప్రగతిని తాను స్వయంగా ప్రతి వారం సమీక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ నిర్వహణతో పాటు పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని హెచ్చరించారు. పనులు ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి దశను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని మంత్రి పేర్కొన్నారు.
ఈ కీలక సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిధుల కేటాయింపు జరిగిన వెంటనే పనులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరూపయోగంగా మారిన వంతెనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రుల బృందం వెల్లడించింది.