ఆర్టీసీ సమ్మె వెనుక కేసీఆర్, హరీశ్రావులున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ సూచన మేరకు గతంలో ఆర్టీసీ బాధ్యతలు చూసిన హరీశ్ తనకున్న పరిచయాలు, సంఘాల ప్రతినిధులతో సమ్మె చేసేలా ప్రోత్సహించారనేది మంత్రి ఆరోపణ. అయితే ఈ కామెంట్లు ఎందుకు చేశాడో తెలియదు కానీ.. ఇవి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసి కార్మికులు సమ్మె కోసం చాలా సార్లు పిలుపునిచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్న సందర్బాలున్నాయి.
ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వారు తమ డిమాండ్ల సాధనకు సర్కార్తో చర్చిస్తూనే ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పథకంతో ప్రభుత్వానికి మంచి పేరొచ్చింది. ఆర్టీసీపై పెను భారం పడింది. దీనికి తగ్గట్టుగా కార్మికలోకానికి తగినంత లాభమైతే చేకూరలేదు. ఆదాయమాటేమో గానీ.. తమకు రావాల్సిన బెనిఫిట్స్, జీతభత్యాల పెంపుదల, తదితర డిమాండ్ల సాధన కోసం మొదటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. సర్కార్ రాగానే సమ్మె చేయడం సరైంది కాదనే ఉద్దేశ్యం వారిలో ఉంది. అందుకే పిలుపునిస్తున్నారు. చర్చిస్తున్నారు. వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి దాకా.
కానీ ఉద్యోగ జేఏసీ తాజాగా సమ్మెకు దిగింది. ఇలా ఒక్కొక్కరుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆర్టీసి కూడా సమ్మెకు దిగింది. ఈవీ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయనున్నారనేది కార్మికుల ప్రధాన ఆరోపణ. దీనికి తోడు గత సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించి.. గవర్నర్ దగ్గర ఆపేసింది. దీంతో ఇది అటకెక్కింది. ఈ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. ఇది కూడా కార్మికులకు అసంతృప్తిని రగిల్చింది. ఇవన్నీ సమస్యలతో ఆర్టీసి సమ్మెకు దిగింది. సర్కార్ మనసు పెట్టి మాట్లాడితే సమ్మె విరమించే అవకాశాలు లేకపోలేదు. కానీ ఎందుకో ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. దీంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. కానీ తాజాగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే కామెంట్లు వస్తున్నాయి.
కేసీఆర్ పాలనలో ఆర్టీసీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. తన మాట వినని యూనియన్లు లేకుండా చేశారు. సమ్మె సమయంలో మరీ క్రూరంగా ప్రవర్తించడంతో కార్మికులు చనిపోవాల్సి వచ్చింది. అయినా దిగిరాలేదు. కేసీఆర్ ఇలా చేస్తారా? ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? అని అన్ని వర్గాలు ఆశ్చర్యపోయేలా ఆ పాలన కొనసాగింది. ఇదిప్పటికీ కార్మికలోకం మరిచిపోదు. తీవ్ర నష్టం జరిగిన తరువాత మళ్లీ వారిని దగ్గర తీసి బుజ్జగించారు కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్, హరీశ్లు చెబితే వారింటారా? సమస్యలు ఉన్న మాట నిజం. తీవ్ర ఇబ్బందులు పడుతున్నదీ నిజం. ఈవీ బస్సులు పెంచి, ప్రైవేటు వారికి అప్పగిస్తున్నదీ నిజం. మరి వీటిపై జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత సర్కార్ పై ఉంటుంది.
ఇక్కడే బాధ్యతతో చర్చలు జరిపి ఉంటే పరిస్థితి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఫ్రీ బస్సులతో మహిళలకు ఎంతో వ్యయభారం తగ్గుతున్నది. దీన్ని సాఫీగా కొనసాగించాలంటే ప్రభుత్వం ఆర్టీసీతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి పోవాలి. మొత్తం పరిష్కారాలు ఒక్కసారి కాకున్నా.. కొన్ని కొన్నైనా తీర్చుతూ పోతే తిరిగి ఆర్టీసి గాడీలో పడుతుంది. పొన్నం చేసిన కామెంట్ల ద్వారా ప్రయోజనం లేకపోగా.. సర్కార్కు సత్తువ లేక ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నదనే బద్నాం మూటగట్టుకుంటుందనే అపవాదు వచ్చిపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.