Voter Revision: తెలంగాణలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని అన్నారు. దీనితో ప్రభుత్వం పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేందుకు 5 రోజులు గడువు మాత్రమే ఉన్నందున ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం పూర్తైందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్ నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట్, పరకాల, బోద్ నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను ప్రశంసించారు.
అటు శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల అధికారులు డిజిటలైజేషన్ మరింత ఫోకస్ పెట్టాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు పేర్లను తప్పులు లేకుండా అప్ లోడ్ చేసేలా బీఎల్ఓలు, సూపర్ వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ లో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!
మరోవైపు ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఎల్ఓల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలను వీడియోగ్రాఫ్ చేసి డాక్యుమెంట్ చేయాలన్నారు. దాంతో పాటు వీఐపీ, వీవీఐపీల ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు.
Also Read: రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!