Chicken Strike: తెలంగాణలోని మాంసాహార ప్రియులకు చేదువార్త. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయదారులు సమ్మె బాట పట్టడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ సెంటర్లు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, మార్జిన్ల తగ్గింపు వల్ల తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిరసన నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రధానంగా పౌల్ట్రీ యజమాన్యాలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే లాభాల వాటాను (మార్జిన్ను) భారీగా తగ్గించడం ఈ వివాదానికి మూలకారణమైంది. నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, షాపు అద్దెలు పెరుగుతున్న తరుణంలో కంపెనీలు తమ లాభాలను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నిరసన గళాన్ని వినిపించేందుకు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఈ బంద్కు పూర్తి మద్దతు ప్రకటించారు. స్థానిక గురుకుల్ కళాశాల మైదానంలో సమావేశమైన వ్యాపారులు, పౌల్ట్రీ కంపెనీల ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఉన్న మార్జిన్ను పునరుద్ధరించే వరకు వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మె ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఆదివారాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో చికెన్ లభ్యత లేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం లేదా సంబంధిత పౌల్ట్రీ బోర్డులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించకపోతే, మార్కెట్లో చికెన్ కొరత ఏర్పడి ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: నగరవాసులకు గుడ్ న్యూస్.. భారీగా మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సభాపతి, కాజా తదితరులు పాల్గొని తమ డిమాండ్లను వివరించారు. చిన్న వ్యాపారులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కంపెనీలు తమ మొండి వైఖరి వీడి చర్చలకు రావాలని వారు కోరారు. న్యాయమైన మార్జిన్ లభించే వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి ఈ నిరసనలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
Chicken prices have fallen sharply in Hyderabad. pic.twitter.com/y6Tj1lxSp8
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2026