Metro Expansion: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ కు మెట్రో నెట్ వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న ఇబ్బందులను లోతుగా సమీక్షించి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్ 1 మొత్తం 69 కిలోమీటర్లు ఉన్నదని, ఫేజ్ 2(ఏ) 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 (బీ) 86.1 కిలోమీటర్ల ఉన్నదన్నారు. ఈ మేరకు ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం సమర్పించిందన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ఫేజ్-I ప్రైవేట్ నిర్వహణలో ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్-II ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఆంశాలను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుండి మెట్రో ఫేజ్ 1 నెట్వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ ఎమ్ ఆర్ ఎల్ ద్వారా స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఇందుకు సభ కూడా ఆమోదం తెలిపిందన్నారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకునే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన సభకు ధన్యవాదాలు తెలిపారు. ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టి కృషి చేస్తున్నట్లు సీఎం వివరించారు.
బోయినపల్లి మార్కెట్ కాదు.. నరక ద్వారం.. ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్!