Harish Babu: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని అనేక గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, కనీసం చేతి పంపులు కూడా లేవని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో పలు సమస్యలపై సిర్పూర్ శాసన సభ్యుడు పాల్వాయి హరీష్ బాబు శనివారం గళం విప్పారు. వేసవి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎక్కడ బోర్ వెల్స్ అవసరమో గుర్తించి అక్కడ గ్రామానికి రెండు బోర్ వేల్స్ సౌకర్యం కల్పించాలన్నారు. మంత్రి గ్రామ పంచాయతీలకు రూ.1100 కోట్లు విడుదల చేశామని అంటున్నారని, ఆ డబ్బులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ కు కానీ, పంచాయతీ వర్కర్ల జీతాలకు కూడా సరిపోదని తెలిపారు. మూడు నెలలకోసారి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని ఆయన పట్టుపట్టారు. పోయిన వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవని, అలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు బాగుపడేది ఎప్పుడు? మనుగుడ ఎలా? అని ప్రశ్నించారు.
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీల భవనాలు, మహిళ సమైక్య భవనాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తున్నారన్నారు. రాజీవ్ యువ వికాస పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంప్లాయిమెంట్ కోసం గత బడ్జెట్లో రూ.6000 కోట్ల రూపాయలు కేటాయించారని, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని హరీశ్ బాబు విమర్శించారు. 16 లక్షల మందికి పైగా దరఖాస్తులు పెట్టుకున్నారని, కానీ ఎవరికీ ఒక్క రూపాయి రాలేదన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్లీ రూ.6000 కోట్లు కేటాయించారన్నారు.
ఈ బడ్జెట్లో వ్యవసాయానికి, గృహ నిర్మాణాలకు, సాగునీటి రంగానికి, పశు సంవర్ధక రంగానికి నిధులు తగ్గించారని విమర్శించారు. వీటన్నింటికి నిధులు తగ్గిస్తే రాష్ట్రం ముందుకు ఎలా సాగుతుందని ప్రశ్నించారు. 23,100 మంది విద్యుత్ ఆర్టీజన్లు రెగ్యులర్ చేస్తామని ఇప్పటివరకు చేయలేదన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్, బిల్ కలెక్టర్లకు కూడా కనీస వేతనాలి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా సౌర గిరి జల వికాసం కింద సోలార్ పంపు సెట్ల కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారని, కానీ ఎవరికీ ఇప్పటివరకు ఇవ్వలేదని హరీశ్ బాబు పేర్కొన్నారు.
Also Read: నగరవాసులకు గుడ్ న్యూస్.. భారీగా మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!