Chief Secretary: స్వేచ్చ బ్యూరో: సీఎస్ ఎంపికపై సస్పెన్స్ ముదురుతోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావు పదవీ కాలం ఈ జూన్ 30తో ముగియనుండటంతో, తదుపరి ఏం జరగబోతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రామకృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు ఉండటం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం భావిస్తుండటంతో మరోసారి పొడిగింపు (ఎక్స్టెన్షన్) కోసం కేంద్రానికి లేఖ రాయాలని సర్కార్ యోచిస్తోంది. ఒకవేళ కేంద్రం నో చెబితే.. ఆ కుర్చీని దక్కించుకునేందుకు నలుగురు సీనియర్ ఐఏఎస్లు తెరవెనుక గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1991 బ్యాచ్కు చెందిన కే.రామకృష్ణారావు 2025 ఏప్రిల్ 30న చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు.
వాస్తవానికి ఆయన అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్ కావాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును మొదట 7 నెలల పాటు (మార్చి 31, 2026 వరకు) పొడిగించింది. ఆ తర్వాత కూడా పాలనాపరమైన అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ కోరడంతో కేంద్రం మరో 3 నెలల పాటు (జూన్ 30 వరకు) పొడిగింపు ఇచ్చింది.అయితే ఇప్పటికే రెండు సార్లు ఎక్స్టెన్షన్ లభించడంతో, మూడోసారి కూడా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా ? అనేది సస్పెన్స్ నెలకొంది. అయితే, కీలకమైన ప్రభుత్వ పథకాల అమలు, కిందిస్థాయి అధికారులతో సమన్వయం దెబ్బతినకుండా ఉండాలంటే రామకృష్ణారావును మరికొన్ని నెలల పాటు కొనసాగించడమే సరైన నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
Also read: సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!
ఒకవేళ ఈ దఫా కేంద్రం నుంచి ఎక్స్టెన్షన్కు బ్రేక్ పడితే.. కొత్త సీఎస్ ఎవరనే దానిపై సచివాలయంలో గట్టి పోటీ నడుస్తోంది. నలుగురు స్పెషల్ సీఎస్ స్థాయి అధికారులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. సంజాయి జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్ లు పొటీ పడుతుండగా, వికాస్ రాజ్ వైపే సర్కార్ మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతుంది. కేంద్ర సర్వీస్ లో ఉన్న సంజ్ జాజు ఏకంగా హైకమాండ్ తో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక జయేష్ రంజన్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఉత్కంఠగా మారింది.
కొత్త అధికారిని ఎంపిక చేయాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని స్పష్టమైన లైన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సీనియారిటీ మాత్రమే కాకుండా,కిందిస్థాయి అధికారులను, విభాగాధులను సమర్థవంతంగా సమన్వయం చేసుకోగలగాలి. అంతేగాక ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లడంలో నిబద్ధత ప్రదర్శించాలి.ఈ కోణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సదరు అధికారుల ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి కేంద్రం మూడోసారి ఎక్స్టెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక రాష్ట్ర పరిపాలన కొత్త బాస్ చేతుల్లోకి వెళ్తుందా? అనేది తేలాలంటే ఈ నెల ఆఖరి వరకు వేచి చూడాల్సిందే.
Also read: అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ. 5000 పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!