ఉద్యమ పార్టీగా పేరుగాంచి.. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆరెస్ పార్టీ ఇప్పుడు ఉద్యమ పంథాను మార్చుకున్నదా? సోషల్ మీడియాకే పరిమితవుతోందా? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా జనాన్ని తమ పార్టీ వైపు ఆకర్షించుకోవాలనే నయా పంథాను ఎంచుకున్నదా? అంటే అవుననే అనిపిస్తున్నది కేటీఆర్ తీరు.. బీఆరెస్ పార్టీ విధానం చూస్తుంటే. ఆ పార్టీ నుంచి వేరుపడి కొత్త పార్టీ టీఆరెస్ పెట్టుకున్న కవిత… ప్రాధాన్యతాంశాల వారీగా దూకుడుగా పోతుంటే.. కేటీఆర్ సారథ్యంలో బీఆరెస్ పార్టీ ప్రజా బాహుళ్యానికి దూరమవుతున్నదా? అని అనిపించేలా వ్యవహరిస్తున్నది.
ఇదిప్పుడు చర్చకు వస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్ను ఎంతగా గమనిస్తున్నారో.. ఆ పార్టీ నుంచి వేరుపడి.. కొత్త పార్టీ పెట్టుకున్న కవిత వేస్తున్న అడుగులనూ అంతే ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు? ఎవరి పంథా ఎలా ఉంది ? అనే పోలికలను జనంతో పాటు ఆ రెండు పార్టీల నేతలు కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఓడిన తరువాత కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితం కావడం… కేటీఆర్ పార్టీని మొత్తం తన చేతిలోకి తీసుకుని దూకుడుగానే కార్యక్రమాలు నిర్వహించాడు. కానీ తరువాత చల్లబడ్డాడు.
కేవలం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ఎక్కువగా రాజకీయాలను నడుపుతున్నది ఆ పార్టీ. తెలంగాణ భవన్లో విరివిగా ప్రెస్మీట్లు పెట్టుకుంటున్నది. తిట్ల రాజకీయాల్లో పోటీలు పడుతున్నది. కొత్త పంథాలో పోయేందుకు ఉవ్విళ్లూరుతున్నది. అది జనానికి ఎంత చేరువ చేస్తుందనే విషయాన్ని మాత్రం విస్మరించింది. కానీ, కవిత విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమెకు వనరులు చాలా తక్కువ. కొత్త పార్టీ. నిర్మాణం ఇంకా కానేలేదు. బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పార్టీ మాత్రం కొన్ని విషయాల్లో రిస్కీ టాస్క్లను ఎంచుకోవడం చర్చకు దారి తీస్తోంది.
మొన్న ఖమ్మం వెలుగుమట్లలో చేపట్టిన ఆందోళన.. కవిత ఎలాంటి పోరాట పంథా ఎంచుకున్నారో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఆ తరువాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో.. పాదయాత్రకు సిద్దం కావడం… కీలకమైన ఉద్యమకారుల ఇష్యూలో చాలా ముందు వరుసలో కవిత టీఆరెస్ పార్టీ ఉంది. ఉద్యమకారుల అంశాన్ని కనీసం టచ్ కూడా చేయడం లేదు బీఆరెస్. పదేళ్ల పాలనలో ఉద్యమకారులను విస్మరించారని, వారిని పట్టించుకోలేదనే ఆరోపణ ఉండనే ఉంది. దీంతో ఈ ఇష్యూను ఎత్తుకుంటే మరింత బద్నాం అవుతామనే భయం బీఆరెస్ను వెంటాడుతోంది. ఇదే కవితకు కలిసివచ్చింది. ఆమె మొదటి నుంచి ఉద్యమకారుల గురించి గళం విప్పుతూ వస్తున్నారు.
ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వచ్చే నెల 2 వరకు ప్రభుత్వానికి గడువిచ్చారు. ఆ తరువాత ఉప్పల్ భగాయత్లోని ప్రభుత్వ భూమిలో మరో భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది. మరో మిలియన్ మార్చ్ను తలపించేలా ఈ ఆందోళన చేద్దామన్న ఆమె… ఉద్యమకారులందరినీ సద్దికట్టుకుని రావాల్సిందిగా పిలుపునిచ్చారు. మరో వైపు బాయిబాట పేరుతో సింగరేణిలో ఆమె పర్యటన ఖారయ్యింది. ఎక్కడ సమస్య అంటే వాటిపై ఉద్యమాల నిర్మాణాలతో పరిష్కారాల కోసం సర్కార్పై ఒత్తిడి పెంచడం టీఆరెస్ చేస్తుంటే.. బీఆరెస్ మాత్రం అందుకు విరుద్దంగా పోతున్నది.