CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించడం, పునరుత్పాధక ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCR HRD)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఇబ్బందులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సరఫరాలో లోపాలను సరిదిద్దేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించారు.
ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకుండా చూడాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక విద్యుత్ అవసరాలు, హైస్పీడ్ రైలు క్యారిడార్లు, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ పవర్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టిసారించిన విషయాన్ని కూడా ఈ సమీక్షలో ప్రస్తావించారు.
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 2 చొప్పున మెుత్తం 18 సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అది కూడా సబ్ స్టేషన్ల పక్కనే వాటిని నిర్మించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని అన్నారు. అలాగే సోలార్ స్టవ్ ల వినియోగం, సోలార్ పవర్ ప్లాంట్ ల వినియోగంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు విస్తృత అవగాహన కలిగించాలని అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.
మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు డిస్కమ్ పై విద్యుత్ ఉద్యోగుల్లో ఉన్న అపోహలను తొలగించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. గ్రీన్ ఎనర్జీ దరఖాస్తులు, భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులను ప్రాధాన్యత క్రమంలో అనుమతించాలని ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ అవసరాలకు సరిపడ విద్యుత్ అందుబాటులో ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం కోరారు.
Also Read: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ రీపోలింగ్.. బారులు తీరి ఓటేస్తున్న ప్రజలు
అంతకుముందు శుక్రవారం (మే 1) తనను కలిసేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందన్నారు. శంషాబాద్ లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రో తో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీజీల్ పైన ఆర్టీసీ ఏటా రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తోందని.. దీనిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని నిర్ణయించామని సీఎం స్పష్టం చేశారు.
Also Read: బిగ్ అలర్ట్.. ఏపీలో దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో అన్నదాతల్లో టెన్షన్!