Praja Palana: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజాపాలన”ను కేవలం నినాదంగా కాకుండా కార్యాచరణగా మలిచేందుకు ముందడుగు వేసిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభమైన 99 రోజుల ప్రణాళికతో గ్రామ సభ నుంచి రాష్ట్ర స్థాయి సమీక్ష వరకూ దశలవారీగా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే కార్యక్రమానికి నాంది పలికిందన్నారు. బాధ్యత, పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం అనే మూడు సూత్రాలపై నిర్మితమైన ఈ కార్యాచరణ రాష్ట్ర పాలనకు కొత్త దిశానిర్దేశంగా మారబోతోందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్ర బిందువని గుర్తించిన ప్రభుత్వం, “ప్రజల వద్దకే ప్రభుత్వం” అనే లక్ష్యంతో ఐదు దశల్లో 99 రోజుల ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. మార్చి 6న ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఏప్రిల్ 2న గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి సమావేశాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయి సమీక్షలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమగ్ర విశ్లేషణతో కొనసాగుతుందని వివరించారు. ఇది కేవలం షెడ్యూల్ కాకుండా పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యతాయుతమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. గ్రామ సభల్లో వినిపించే ప్రతి సమస్య, ప్రతి సూచన పాలనలో ప్రతిఫలించేలా వ్యవస్థను రూపొందించడం ఈ ప్రణాళిక ప్రత్యేకత అని అన్నారు.
Also Read: Kamareddy Incident: మహిళా దినోత్సవం రోజు దారుణం.. ముగ్గురి ఆడబిడ్డల్ని తండ్రే చంపి.. ఆ తర్వాత
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ 99 రోజుల కార్యక్రమాన్ని 10 ప్రధాన థీమ్లుగా విభజించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రంగాల వారీగా దృష్టి కేంద్రీకరించి ఫలితాలను కొలిచే విధంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. పరిశుభ్రత కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్కు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడం ద్వారా ప్రజా సేవల వేగం పెరుగుతుందని తెలిపారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం, స్క్రీనింగ్ శిబిరాలు, మాతా-శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళామణులందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న పాత్ర అపూర్వమని, కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళల సేవలు అమూల్యమని ఆయన పేర్కొన్నారు.మహిళల సాధికారత లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక రంగాలు, క్రీడలు వంటి ప్రతి విభాగంలో మహిళలు ప్రతిభ చాటుతూ దేశ ప్రగతిలో కీలక భాగస్వాములవుతున్నారని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
Also Read: Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!