Child Safety: ఆన్లైన్ వేదికల్లో చిన్నారుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు సంబంధించిన అసభ్యకర వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు భారీ ఎత్తున కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్లలో అసాంఘిక కంటెంట్ను వ్యాప్తి చేస్తున్న 30 మందిని గుర్తించి, వారిపై ఐటీ చట్టం సెక్షన్ 67B కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే 23 మంది నిందితులు ఉండటం గమనార్హం. వీరితో పాటు వరంగల్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట ప్రాంతాల్లో ఒక్కొక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. విదేశీ వెబ్సైట్ల నుండి అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి, స్థానిక గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్న ఈ ముఠాల కదలికలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఆన్లైన్ వేదికల్లో ఇటువంటి కంటెంట్ పెరగడం వల్లే సమాజంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఐటీ చట్టం సెక్షన్ 67B ప్రకారం, చిన్నారుల అసభ్యకర కంటెంట్ను వీక్షించడం, నిల్వ చేయడం లేదా ఇతరులకు పంపడం శిక్షార్హమైన నేరం. ఈ చట్టం కింద మొదటిసారి నేరానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ గమనించినా వెంటనే సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930 కు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇందులో “Report Women/Child Related Crime” అనే ప్రత్యేక విభాగం ఉంటుంది. మీరు మీ వివరాలు బయటపెట్టకుండా కూడా ఫిర్యాదు చేసే సౌకర్యం ఈ పోర్టల్లో ఉంది. మీ దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. తెలంగాణలో అయితే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారిని సంప్రదించవచ్చు.
Read Also: శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన.. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం: సీఎం రేవంత్