బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని, దీనిని సరిదిద్ది శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
గత పాలనపై విమర్శలు..
గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టారాజ్యంగా చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కనీస ప్రాతిపదిక లేకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలను ముక్కలు చేశారని ఆయన మండిపడ్డారు. కేవలం ఐదు మండలాలతో జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయడం ఏ రకమైన పరిపాలన అని ఆయన ప్రశ్నించారు. అశాస్త్రీయంగా జరిగిన ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలన చేరువ కావాల్సింది పోయి.. మరింత గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.
సికింద్రాబాద్ పేరుపై వివరణ..
సికింద్రాబాద్ జిల్లా పేరు మార్పు లేదా తొలగింపుపై జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే సికింద్రాబాద్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సికింద్రాబాద్ పేరు ఎక్కడుంది? నేను ఎక్కడ తీశాను? జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ ఒక భాగంగానే ఉంది. అలాగే హైదరాబాద్ జిల్లాలోనే సికింద్రాబాద్ కొనసాగుతోంది. మల్కాజిగిరిని మేం పెట్టలేదు, తీయలేదు’ అని ఆయన స్పష్టత ఇచ్చారు. పేరు మార్పుల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.
కమిటీ ఏర్పాటు.. ఆరు నెలల గడువు
జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ జడ్జీలు, అనుభవం ఉన్న మాజీ అధికారులను సభ్యులుగా నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. ప్రజల అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించి, రాబోయే ఆరు నెలల్లోగా పూర్తిస్థాయిలో మార్పులు చేస్తామని ఆయన వెల్లడించారు.
రాచకొండ పేరు మార్పు..
రాచకొండ పేరుపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పేరు రాజుల కాలాన్ని తలపించేలా ఉందని, అందుకే దానిని మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరిపాలన సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కొత్త జిల్లాల స్వరూపం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించిన తర్వాతే గెజిట్ విడుదల చేస్తామని.. ఏకపక్ష నిర్ణయాలు ఉండబోవని ముఖ్యమంత్రి సభకు హామీ ఇచ్చారు.
ALSO READ: PM Modi: సబర్మతి తీరాన అంబరాన్నంటిన సంబరాలు.. గాలిపటం ఎగురవేసిన ప్రధాని మోదీ