Operation Crackdown 2.0 : తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శాంతిభద్రతల విభాగం పోలీసులతో కలిసి ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 పేరుతో భారీ ఆపరేషన్ను చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడి గతంలో అరెస్టయిన నిందితులు మళ్లీ అదే బాటలో పయనించకుండా, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. 2024-2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,567 మందిని సైబర్ నేరాల కింద అరెస్ట్ చేయగా, వారిలో తెలంగాణ నివాసితులైన 614 మందిని ప్రత్యేకంగా గుర్తించి వారిపై డేగ కన్ను వేశారు.
ఈ నిఘా జాబితాలో ఉన్న 614 మంది నిందితుల్లో 269 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 155 మంది ఏజెంట్లు ఉండగా, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) కేసుల్లో 36 మంది, సైబర్ స్లేవరీలో 8 మంది, ఫేక్ సిమ్ డీలర్లు 6 మందితో పాటు బ్యాంక్ ఉద్యోగులు, కాల్ సెంటర్ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల నుంచి 300 బృందాలు ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దిగాయి. నిందితుల ప్రస్తుత నివాసం, వృత్తి, ప్రవర్తనను పర్యవేక్షించడానికి ఐదు వ్యూహాత్మక పద్ధతుల ద్వారా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపట్టారు.
ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు నిందితుల ఇళ్లకు నేరుగా వెళ్లి భౌతిక ధృవీకరణ చేయడంతో పాటు, వారి ప్రస్తుత లొకేషన్ను జియో-ట్యాగింగ్ చేశారు. అలాగే వారి ఆర్థిక కార్యకలాపాలు, డిజిటల్ ఉనికిని పర్యవేక్షించడం, వారి ఉపాధి, తోటి నెట్వర్క్ల గుర్తింపు, బెయిల్ షరతుల అమలును నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల నేరగాళ్లలో భయాన్ని కలిగించడంతో పాటు మళ్లీ నేరం చేయకుండా అడ్డుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజా క్షేత్రస్థాయి ఫలితాల ప్రకారం, ఇప్పటివరకు 335 మంది నిందితులను పోలీసులు స్వయంగా తనిఖీ చేశారు. ఈ నిందితులు తెలంగాణలో 480 కేసులు, దేశవ్యాప్తంగా ఏకంగా 1,233 కేసులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 218 మంది ఆచూకీ దొరకగా, కొందరు పాత నివాసాల్లోనే ఉంటున్నారు మరికొందరు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు మారారు. అయితే 115 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ముగ్గురు నిందితులు మరణించినట్లు నివేదికలు అందాయి. ఈ తనిఖీల్లో ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని నాంకింగ్ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేసి, CSAM కేసులో అరెస్టయిన నిందితుడు ప్రసాద్ కుమార్ ప్రస్తుతం నేపాల్లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లకు ప్రభుత్వం ఒక బలమైన హెచ్చరికను పంపింది. ఒకసారి అరెస్టయిన తర్వాత కూడా నేరగాళ్లు పోలీసుల నిరంతర నిఘాలోనే ఉంటారని, అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వారిపై పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ‘సస్పెక్ట్ షీట్స్’ ఓపెన్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. పౌరులను సైబర్ మోసాల నుండి రక్షించడంలో తెలంగాణ పోలీస్ విభాగం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Read Also: నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!