తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ప్రస్తుతానికి డీజీపీకి ఊరటనిచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి కొనసాగుతున్న న్యాయ వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామక ఉత్తర్వులను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ దాఖలైన మధ్యంతర దరఖాస్తును ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ప్రస్తుత డీజీపీకి పెద్ద ఊరట లభించినట్లయింది.
నాలుగు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి..
డీజీపీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. రెగ్యులర్ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిబంధనల మేరకు అర్హులైన అధికారుల జాబితాను పంపి, తదుపరి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి ఆదేశాలు.. కౌంటర్ దాఖలు
UPSCకి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని.. నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని కోర్టు అభిప్రాయపడింది.
ఫిబ్రవరి 5న తదుపరి విచారణ..
పిటిషనర్ల వాదనలు, ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా నియామక ప్రక్రియకు సంబంధించి కోర్టుకు నివేదించాల్సి ఉంటుంది. డీజీపీ నియామకంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో.. ప్రస్తుతానికి శివధర్ రెడ్డి తన పదవిలో కొనసాగడానికి ఎలాంటి ఆటంకాలు లేవు.
ALSO READ: Cm Revanth : మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!