డిజిటల్ వేదికలపై ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో సాగుతున్న వికృత ధోరణులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియాను కొందరు వ్యక్తులు ఇతరుల వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చుకోవడంపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలతో ఇతరుల ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, ఫోటోలు షేర్ చేసే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారమ్స్లో ఫేక్ న్యూస్ను సర్క్యులేట్ చేయవద్దని డీజీపీ సూచించారు. ‘అబద్ధపు ప్రచారాలు సమాజంలో అశాంతికి దారితీస్తాయి. ఎవరి వ్యక్తిగత లేదా ఫ్యామిలీ విషయాలపైనా అబద్ధాలు ప్రసారం చేయకూడదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారు తాము చట్టం దృష్టిలో ఉన్నామని గుర్తుంచుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. ‘చట్టానికి లోబడి, గౌరవప్రదమైన భాషలో విమర్శలు చేసుకుంటే పోలీసులకు ఎలాంటి సమస్య లేదు. కానీ, విమర్శ పేరుతో బూతులు తిట్టడం, వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం వంటివి చేస్తే మాత్రం ఆ పరిధి దాటినట్లుగా పరిగణిస్తాం. అటువంటి వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడం’ అని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని, వివాదాస్పద పోస్టులు పెట్టే వారి ఐపీ అడ్రస్లను గుర్తించి అరెస్టులు చేస్తామని ఆయన వెల్లడించారు. నెటిజన్లు సోషల్ మీడియాను విజ్ఞానం కోసం, సమాచార మార్పిడి కోసం వాడుకోవాలే తప్ప, ఇతరుల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి కాదని హితవు పలికారు. సోషల్ మీడియా వినియోగదారులు స్వీయ నియంత్రణ పాటించాలని, చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా డీజీపీ విజ్ఞప్తి చేశారు.
ALSO READ: YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!