YS Jagan Mohan Reddy: ఎన్టీవీ (NTV) జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.
“పండుగ పూట అర్ధరాత్రి వేళ, కనీస చట్టపరమైన నోటీసులు ఇవ్వకుండా, జర్నలిస్టుల ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి బలవంతంగా అరెస్టు చేయడం అత్యంత విచారకరం. ఇది నిరంకుశ ధోరణికి నిదర్శనం. జర్నలిస్టులు నేరస్తులు కాదు, తీవ్రవాదులు అంతకంటే కాదు. కానీ వారిని ఇంత కఠినంగా ఎదుర్కోవడం అన్యాయం.” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇటువంటి చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాయని, మీడియా వర్గాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “వెంటనే అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి. చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.” అని ఆయన డిమాండ్ చేశారు.
I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026
మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు (TUWJ, IJU, ప్రెస్ క్లబ్) ఈ అరెస్టులను ఏకగ్రీవంగా ఖండిస్తున్నాయి. నోటీసులు ఇవ్వకుండా, పండుగ రోజున కుటుంబ సభ్యుల సమక్షంలో తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని జర్నలిస్టు నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి