Teacher Unions: స్వేచ్ఛ బ్యూరో: విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో రాష్ట్ర విద్యా కమిషన్ తాజాగా ఇచ్చిన సిఫార్సులు తీవ్ర వివాదానికి దారితీశాయి. పాఠశాల విద్యాశాఖలో సమూల మార్పుల కోసం రాష్ట్ర విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు ఇప్పుడు ఉపాధ్యాయ లోకంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు, జీతభత్యాలు, బదిలీల వంటి కీలక అంశాల్లో కమిషన్ జోక్యం చేసుకోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్ తన పరిధిని మించి వ్యవహరిస్తోందని, ఉపాధ్యాయుల హక్కులను కాలరాసేలా నివేదిక ఉందని ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.
సాధారణంగా ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, జీతభత్యాల నిర్ణయం ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు ప్రభుత్వం వేసే వేతన సవరణ సంఘం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్ణయిస్తుంది తప్పితే.. విద్యా కమిషన్ కాదని చెబుతున్నారు. అయితే, వీటిపై కమిషన్ చేసిన సిఫార్సులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సర్వీస్ రూల్స్లో మార్పులు చేయాలన్న ప్రతిపాదనను వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల విద్యార్హతలను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్ సీటీఈ అని, కానీ విద్యా కమిషన్ తన పరిధి దాటి పీజీ, బీఈడీలను నిర్ణయించడం అనాలోచిత సూచనగా కొట్టిపారేశారు. సబ్జెక్టు విద్యార్హతల విషయంలో ఇప్పటికే వివిధ స్థాయిలకు తగినంత నిర్ణయాలు అమలవుతున్నాయని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే విద్యాలయంలో 1500 మంది నుంచి 2000 మంది వరకు ఉంచి విద్యా బోధన చేయాలి అనేది పూర్తిగా అశాస్త్రీయమైన నిర్ణయంగా పేర్కొన్నారు. వందల మందిని ఒకే చోట ఉంచి వసతులు కల్పించడం చాలా సమస్యగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక ఉన్నత విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, రకరకాల అంటువ్యాధులు ప్రబలడం, క్రమశిక్షణ లోపించడం వంటి సమస్యలు వస్తే మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. దీనికి బదులు ఇప్పుడున్న విద్యాసంస్థలనే మరింత బలోపేతం చేసి విద్యార్థులకు ట్రాన్స్ పోర్ట్ చార్జీలను నెలవారీగా సక్రమంగా అమలుచేస్తే బలోపేతం చేయొచ్చని విద్యా కమిషన్ కు సూచిస్తున్నారు.
ఒకే ప్రాంగణంలో కేజీ స్థాయి పిల్లల నుంచి ప్లస్ టు వరకు కలిపి పాఠశాల నిర్వహణ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీనికి బదులు ఏస్థాయి విద్యార్థులకు అనుగుణంగా ఆస్థాయి పాఠశాలలను ఉన్న వాటిని నాణ్యతతో తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు. ఒకే చోట పెద్ద పాఠశాల ఏర్పాటు చేస్తే ఇప్పటివరకు వివిధ ఆవాసాల్లో నిర్మించిన పాఠశాలల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు తెలంగాణ విద్యా కమిషన్ నుంచి సమాధానం లేదని ఉపాధ్యాయ సంఘాలు చురకలంటించాయి. ఉన్న సౌకర్యాలను వదిలి కొత్తగా మళ్లీ భవన సముదాయాలను నిర్మించాలని చెప్పడం కాంట్రాక్టర్లకు లాభాలను చేకూర్చేలా తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు ఉన్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్షను రద్దు చేయాలన్న ఆలోచనను కమిషన్ వ్యక్తం చేయడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే తిరోగమన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.
సరైన ప్రత్యామ్నాయం లేకుండా ప్రవేశ పరీక్షలను రద్దు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యాబోధన, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై సూచనలు చేయాల్సిన కమిషన్.., ఉపాధ్యాయుల పరిపాలనాపరమైన, వ్యక్తిగత సేవా అంశాల్లో తలదూర్చడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఏకపక్షంగా ఉన్న ఈ సిఫార్సులను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని, విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉపాధ్యాయ జేఏసీ ప్రకటించింది. విద్యా కమిషన్ నివేదిక ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు విద్యా నాణ్యత పెంచాలన్న లక్ష్యం, మరోవైపు ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తే విద్యా రంగంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Asaduddin Owaisi: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?